English | Telugu
ఓటు వెయ్యని వారికి అలా మాట్లాడే హక్కు లేదు : అల్లు అరవింద్
Updated : Nov 30, 2023
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచే ఎన్నికల సందడి మొదలైంది. సామాన్య ప్రజలే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరితోపాటు క్యూలో నిలబడి ఓటు వేసి.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఓటింగ్ శాతం తక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది అని చెప్పుకునే ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 60 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హౖెెదరాబాద్లో ఇప్పటివరకు 21 శాతం మాత్రమే ఓట్లు పోలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది హైదరాబాద్లో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నతమైన పదవులు నిర్వహిస్తున్నవారు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనేది గుర్తించకుండా ఓటింగ్లో పాల్గొనకపోవడం పలువురిని బాధిస్తోంది.
తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ శాతం తక్కువగా ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చుంటారు చూడండీ.. వాళ్లకి నేను ఒకటి చెబుతున్నా.. డోంట్ గ్రిప్.. ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు. వాళ్ళు అలాగా.. వీళ్ళు ఇలాగా.. అని మాట్లాడే హక్కు మీకు లేదు. దాన్ని మీ మనసులో కూడా ఉంచుకోకూడదు. అలాంటిదేమైనా ఉందీ అంటే.. మీరు వచ్చి ఓటు వెయ్యండి. ఇవాళ హాలీడేలే అని బీరు తాగి పడుకునేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.