English | Telugu
మళ్లీ పెళ్లి చేసుకున్నారో, లేదో తేల్చిచెప్పని నరేశ్!
Updated : May 11, 2023
నరేశ్, పవిత్రా లోకేష్ మధ్య బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలంగా వారుసహజీవనం చేస్తూ వార్తల్లో వ్యక్తులుగా ఉంటున్నారు. ఆ ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా కలిసి నటించిన సినిమా 'మళ్లీ పెళ్లి'. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అలనాడు కృష్ణ, విజయనిర్మల జోడీ ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ.. విజయ కృష్ణా మూవీస్. ఆ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.
ఈరోజు కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ భౌతికంగా మన మధ్య లేరు. 1973లో ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థను నరేశ్ పునఃప్రారంబించారు. 'మళ్లీ పెళ్లి' చిత్రాన్ని ఆ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ టైటిల్ లోగోను బుధవారం ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాంచ్ చేశారు. సారథిగా కృష్ణ రథం నడుపుతుండగా, విజయనిర్మల విల్లు నుంచి బాణం వదులుతున్నట్లుగా యానిమేషన్ చేసిన ఆ లోగో ఆకట్టుకుంది. కాగా 'మళ్లీ పెళ్లి' ట్రైలర్ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. నరేశ్, పవిత్రా లోకేశ్ ఇటీవల ఎదుర్కొన్న ఘటనలను ఆ ట్రైలర్లోని సన్నివేశాలు ప్రతిఫలిస్తున్నట్లు ఉన్నాయి.
ప్రశ్న-జవాబు కార్యక్రమంలో పాత్రికేయుల నుంచి నరేశ్ సూటిగా ఓ ప్రశ్నను ఎదుర్కొన్నారు. "మీ ఇద్దరూ నిజంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారా, లేదా చేసుకోబోతున్నారా?" అనే ప్రశ్నకు నరేశ్ సూటింగా జవాబివ్వలేదు. "నాకు పెళ్లి అనే తంతు మీద చాలా గౌరవం ఉంది" అని సమాధానం దాటేశారు. అయితే మీడియా ముందు ఆ ఇద్దరూ తమ అనుబంధాన్ని దాచుకొనే ప్రయత్నం చేయలేదు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. పవిత్ర భుజం మీద నరేశ్ చేయి వేయడం, పవిత్ర తన ప్రసంగంలో సూపర్స్టార్ కృష్ణను కృష్ణ అంకుల్ అని సంబోధించడం, ఎమ్మెస్ రాజును అన్నగారు అనడం.. నరేశ్తో ఆమె అనుబంధాన్ని చెప్పకనే చెప్పాయి. కాగా 'మళ్లీ పెళ్లి' చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.