English | Telugu
'మళ్లీ పెళ్లి' కథకు కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?!
Updated : May 11, 2023
నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'మళ్లీ పెళ్లి'. విజయ కృష్ణా మూవీస్ బ్యానర్పై నరేశ్ స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఇది వారి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన సినిమా అనే అభిప్రాయం కలిగించింది. లేటెస్ట్గా వచ్చిన ట్రైలర్ అయితే మరింతగా దాన్ని బలపరుస్తోంది. నరేశ్, పవిత్ర.. ఇద్దరూ అప్పటికే వివాహితులు కాగా, మళ్లీ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఆ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
అలాగే "అక్కడ కర్ణాటక మీడియాలో ఇంటింటికీ పాకుతున్న మా ఇంటి పరువును ఏం చేయమంటావ్?" అని పార్వతి పాత్రధారి పవిత్ర ఫోన్లో చెప్తుండడాన్ని బట్టి ఆమె పాత్ర ఆమె నిజ జీవిత పాత్ర అనే విషయాన్ని చెప్తుండగా, ఒక సీన్లో పవిత్రతో అన్నపూర్ణ," అసలైన సూపర్స్టార్ పెద్దాయన, బుల్లి సూపర్స్టార్ పెద్దభార్య కొడుకు, నరేంద్ర మేడం గారి కొడుకు" అని చెప్పడాని బట్టి నరేశ్ చేసిన నరేంద్ర క్యారెక్టర్ ఆయన నిజ జీవిత పాత్రను తెలియజేస్తోంది. అయితే ఇది వారి కథేనా? అనడిగితే, ఇలాంటి ఘటనలు సొసైటీలో చాలా జరుగుతుంటాయి అని ఎమ్మెస్ రాజు దాటేయడం, నరేశ్, పవిత్ర కూడా అది తమ కథేనని స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.
ఇది వాళ్ల కథేనని నమ్మేట్లుగా ప్రమోషన్ చేస్తూ, తీరా సినిమాలో అలాంటిది లేకపోతే మేకర్స్ తమను మోసం చేశారని ప్రేక్షకులు భావించే ప్రమాదం ఉంటుంది కదా అని పాత్రికేయులు ప్రశ్నిస్తే, తాము ప్రేక్షకుల్ని మోసం చెయ్యడం లేదనీ, సినిమా చూసిన ప్రేక్షకులెవరూ అలా ఫీల్ కారనీ ఎమ్మెస్ రాజు చెప్పడం మరో ఆసక్తికర అంశం.
కాగా ఈ కథను కృష్ణ గారికి చెప్పామనే విషయాన్ని నరేశ్ బయటపెట్టారు. "కృష్ణ, విజయనిర్మల ఇప్పటికీ జీవించి ఉన్నట్లయితే, ఈ సినిమాని తలపెట్టేవారా? తలపెట్టినా వారు ఒప్పుకొనేవారా?" అనే ప్రశ్నకు, కృష్ణ గారికి ఈ సినిమా కథ తెలుసని నరేశ్ చెప్పారు. ఆయన కథవిని బాగా తీస్తే చక్కని ఎంటర్టైనర్ అవుతుందని అన్నారని కూడా నరేశ్ చెప్పారు. అంటే కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్లు ఆయన చెప్పారు.