English | Telugu
వర్మ ఆమెను కోర్టు మెట్లెక్కిస్తాడా...?
Updated : Nov 11, 2013
ఇటీవలే మంచు విష్ణు నటించిన "దూసుకెళ్తా" సినిమా సెన్సార్ సమయంలో సెన్సార్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ ధనలక్ష్మి ఆ చిత్రం దర్శక, నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టిందట. ఈ విషయంపై హీరో విష్ణు కూడా తన ఆవేదనని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్మ కూడా ఆ బాధితుల్లో ఒకడిగా చేరిపోయాడు. కానీ వర్మ మాత్రం అందరిలా ఊరుకోకుండా ఆమెపై కేసు వేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతకీ ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా..?
వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "సత్య-2". ఈ చిత్రం ఇటీవలే దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. కానీ తెలుగు వెర్షన్ విడుదల మాత్రం కొన్నిచోట్ల ఆలస్యమయ్యింది. దీనికి కారణం హైదరాబాద్ సెన్సార్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ ధనలక్ష్మియే కారణమని అంటున్నాడు వర్మ. తన సినిమాలోని కొన్నిసన్నివేశాలకు అనవసరంగా కత్తెరలు పడటంతో... ఇదేంటని ప్రశ్నించినందుకు తనని "షటప్ యువర్ మౌత్'' అని అసభ్యకరంగా ఆమె దూషించారని వర్మ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఊరుకునేది లేదని, అవసరమైతే ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా వెనకాడనని వర్మ అంటున్నాడు. మరి అసలే వర్మ అందరికంటే భిన్నంగా ఆలోచించే రకం. ధనలక్ష్మిని కోర్టు మెట్లు ఎక్కిస్తాడా లేక మధ్యలోనే డ్రాప్ అవుతాడా అనే విషయం త్వరలోనే తెలియనుంది.