English | Telugu
సొంత ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. విశాఖలో ఎంపీ సాయిరెడ్డి రక్తదానం...
Updated : Apr 17, 2020
అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా రక్తదాన శిబిరాలనుద్దేశించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 14న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రక్తదాన శిబిరాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటనలో పేర్కొంది. అయితే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో కొన్ని సడలింపులు చేసింది. రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కొరకు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లడానికి వీలుగా ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను, రక్తమార్పిడి అవసరాన్ని తెలిపే ఆధారాలను పోలీసులకు చూపించి అనుమతి తీసుకోవాలని తెలిపింది. రెగ్యులర్గా ఆసుపత్రులను సందర్శించే వీలుగా పాస్లను జారీ చేస్తారని ప్రకటించింది. ఆ తర్వాతే రక్తదానం చేయాలి. ఈ నిబంధనను అస్సలు పట్టించుకోలేదు. ఇక రక్తదాన శిబిరంలోనూ భౌతిక దూరం పాటించే విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తుంటే వైసీపీ నేతలు ఆయన చుట్టూ చేరి గుంపుగా నిల్చున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది సాధారణ మాస్కులు ధరిస్తే.. విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్-95 మాస్కులు ధరించి ఉన్నారు.దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇలా నిబంధనలకు తూట్లు పొడిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.