English | Telugu

కర్నూలు ఘటనపై సీఎం జగన్ సీరియస్

అమరావతి : కర్నూలు జిల్లాలో కరోనా మరణించిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కరోనాపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఘటన ప్రస్తావనకు వచ్చింది. ఇది నిజంగా చాలా అమానవీయమని సీఎం పేర్కొన్నారు. కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చని.. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చని చెప్పుకొచ్చారు.

డీజీపీకి సూచన : ‘ కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం కరెక్టుకాదు. అలాంటి పరిస్థితుల్లో వారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్ట్ కాదు. అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు. మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో..? అలాగే స్పందించాలి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలి’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీఎం జగన్ సూచించారు.

వారిపై కేసులు కూడా పెట్టొచ్చు : ‘కరోనా వస్తే మందులు తీసుకుంటే అది పోతుంది. కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడటం సరికాదు. తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టొచ్చు. కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరానితనంగా చూడ్డం సరికాదు. కరోనా అన్నది సోకితే , మందులు తీసుకుంటే పోతుంది. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?.. నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?. తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు. దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?. అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది’ అని సమీక్షలో అధికారులతో సీఎం జగన్ వివరించారు.