English | Telugu

కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే

లక్ష కోట్లకు పైగా విలువజేసే మాన్సాస్ ట్రస్ట్ భూములు కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించగా.. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత ఆయనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆనంద గజపతిరాజు గారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. మన్సాన్ ట్రస్టు చైర్మన్ గా అశోక్‌ గజపతిరాజు పదవీకాలంలో అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని, ట్రస్టును ఆర్థికంగా నష్టపోయేలా చేశారని ఆరోపించారు. ట్రస్టు భూములు కబ్జాలకు గురవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ని కూడా నియమించలేదని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి అశోక్ గజపతిరాజు చర్యలే కారణమని సంచయిత విమర్శించారు.

తాజాగా ఈ వ్యవహారంపై.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. "కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని." అంటూ విజయసాయి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రష్టు పట్టించాడు కాబట్టే సైలెంటై పోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు." అంటూ విజయసాయి హెచ్చరించారు.