English | Telugu

అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా వేధిస్తున్నారు

విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్‌ పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు లోని లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మ(66)కు సీఐడీ అధికారులు‌ నోటీసు అందజేశారు. విశాఖ‌ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రంగనాయకమ్మ అసత్య ప్రచారంతో పోస్టింగ్స్‌ పెట్టారని.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆ పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపి, వాటిని రంగనాయకమ్మ పెట్టినట్టు గుర్తించామని సీఐడీ అధికారులు తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41-ఎ ప్రకారం రంగనాయకమ్మకు నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి మూడేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. అదే నేరాన్ని వారు మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారన్నారు.

రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు. ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు." అని లోకేష్ విమర్శించారు.

"ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్. గ్రామస్తులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారి పై కేసు పెడతారా?. " అని లోకేష్ ప్రశ్నించారు.

"66 ఏళ్ల వృద్ధురాలు పై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి?" అని లోకేష్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.