English | Telugu

కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదు.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంకెల గారడీ తప్ప అందులో ఏమీ లేదని, అదో బోగస్ ప్యాకేజీ అని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాగా, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదని హితవు పలికారు. ప్రధాని మోడీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు.

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగదా? అని ప్రశ్నించారు. ఉన్నంతలో కేంద్రం అద్భుతంగా ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంటల విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని, అలాంటప్పుడు కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

రైతులు, పేద మహిళల ఖాతాల్లో నగదు. 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం. పెన్షన్లు, ఈపీఎఫ్‌, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సాయం.. ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఉపాధి పనులు దినాలు పెంచాం. ఉపాధి నిధులతో తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాజకీయాలను పక్కన పెట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు.