English | Telugu

లాక్డౌన్ 4.0 గైడ్లైన్స్…రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం

దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది.
రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అదే సమయంలో కంటైన్మెంట్ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది.

లాక్డౌన్ 4.0 లో వీటిపై నిషేధం కొనసాగుతుంది

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్ సేవలు, దేశీయ ఎయిర్ అంబులెన్స్లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.

మెట్రో రైలు సేవలు

పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్లైన్/డిస్టెన్స్ లెర్నింగ్ ఎప్పటిలాగే కొనసాగుతుంది.

హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. అయితే, వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్కేర్ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది.

ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచ్న్ తెరిచేందుకు అనుమతులు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు.

సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.

రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.

మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.

కంటైన్మెంట్ జోన్లు కాకుండా నిబంధనల మేరకు వీటికి అనుమతి

రాష్ట్రాల మధ్య సమన్వయం మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకుంటాయి.

కంటైన్మెంట్, బఫర్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు

ఎక్కడెక్కడ రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.

రెడ్, ఆరెంజ్, కంటైన్మెంట్, బఫర్ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.

కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.

కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.

రాత్రి కర్ఫ్యూ... రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి.
అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్ అమలు చేయాలి.