English | Telugu

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరగలేదు: కాటంనేని భాస్కర్ 

ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటం నేని భాస్కర్ ఖండించారు. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి కరోనా ర్యాపిడ్ కిట్లను ఏపీ దిగిమతి చేసుకుందని, దక్షిణ కొరియా కంపెనీకి చెందిన మ్యానుఫాక్చర్ యూనిట్ మన దేశంలో ఉందని ఆయన చెప్పారు. మనం ఆర్డర్ ఇచ్చే నాటికి దేశంలోని ఆ కంపనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్టుకు అనుమతి రాలేదన్నారు. ఇండియాలోని ఆ కంపెనీ యూనిట్ నుంచి చత్తీస్ ఘడ్ కొనుగోలు చేసిందని, ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు ఇస్తే అదే ధర ఇస్తామని తమ ఒప్పందంలో ఉందని కాటంనేని భాస్కర్ చెప్పుకొచ్చారు. కాబట్టి చత్తీస్ ఘడ్ రాష్ట్రం చెల్లిస్తున్న ధరనే చెల్లిస్తామని, భవిష్యత్తులో ర్యాపిడ్ కిట్ ధర రూ. 50కే పడిపోతుందని కూడా ఆయన అన్నారు.

కరోనా బాధితుడికి.. ఆ వైరస్ ఎక్కడ నుంచి సోకిందో తెలియకుంటే కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ఉన్నట్టే అని ఆయన స్పష్టం చేశారు. సుమారు 40 కేసుల్లో వైరస్ ఎక్కడి నుంచి సోకిందో ట్రేస్ కావడం లేదని, మెడికల్ షాపుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరానికి ఎవరికైనా మందులిస్తే వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ కీపర్లను కోరామన్నారు. కొన్ని నెలల్లో వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, కరోనాకు మందులు.. వాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని కాటంనేని భాస్కర్ సూచించారు. ప్రస్తుతం టెస్టుల సంఖ్య 5 వేలుగా ఉందని, ఎనిమిది ల్యాబులు ఉన్నాయి.. ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, చైనా నుంచి వచ్చే కిట్ల విషయంలో ఆ దేెశం విధించిన కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, త్వరలో 10-12 వేల మేర టెస్టుల సామర్ద్యం పెంచుకుంటామని చెప్పారు.