English | Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో 10,000 రూపాయలకే జానీ వాకర్ బాటిల్

* ఎక్సయిజ్ శాఖ లో ఇంటి దొంగలు
* తూర్పు గోదావరి లో కళకళ లాడుతున్న బ్లాక్ మార్కెట్

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ప్రియులకు శుభవార్త. జానీ వాకర్ బాటిల్ 10,000 రూపాయలకే అక్కడ బ్లాక్ మార్కెట్ లో దొరుకుతోంది. అసలు ఏ ఇబ్బంది లేకుండా దొరకాలంటే, తూర్పు గోదావరి జిల్లా రాజోలు వెళితే చాలు, ఎక్సయిజ్ సిబ్బంది తో కుమ్మక్కయిన కొందరు ఔత్సాహికులు 2,300 రూపాయలకే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికే జానీ వాకర్ బాటిల్ ను 10,000 రూపాయల చౌక బేరానికే విక్రయిస్తున్నారు. అయితే, మద్య విమోచన ప్రచార కమిటీ వర్షన్ మాత్రం మరోలా ఉంది... అదేదో వారి మాటల్లోనే చదివి ఆనందించండి.

మార్చి 22 నుండి సీలు వేసి మూసివేసిన 3500 ప్రభుత్వ మద్యం షాపులను, 800లకు పైగా వున్న బార్ మరియు రెస్టారెంట్ లను తనిఖీలు చేసి అక్రమంగా మద్యం తరలించి వుంటే సంబంధిత సూపర్ వైజర్, సేల్స్ మెన్ లతో పాటు బార్ యజమానులు, సంబంధిత అధికారులపై సత్వర చర్యలు చేపడుతామని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వాళ్ళంరెడ్డి లక్ష్మణ రెడ్డి చెపుతున్నారు. జాన్ వాకర్ 10,000 రూపాయలకే దొరుకుతున్న విషయం వారిదాకా ఇంకా వచ్చి ఉండకపోవచ్చు.

మార్చి 22న సీలు వేసిన సమయానికి వున్న మద్యం నిల్వలు తనిఖీలు చేసిన సందర్భంగా వున్న మద్యం నిల్వలలో ఏమాత్రం తేడా వచ్చినా కఠినంగా శిక్షిస్తాం.ఈ తనిఖీల నిర్వహణ కోసం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, మద్యం డిపోల సిబ్బందితో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్టు-ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరిండెంట్స్ ఎన్.బాలకృష్ణన్, ఎస్. రవికుమార్, సి. హెచ్. వి మహేష్ కుమార్ మీడియా ప్రతినిధులకు వివరించారు.

కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడా మద్యం షాపులు, బార్ మరియు రెస్టారెంట్ ల నుండి అక్రమంగా మద్యం తరలించినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ అక్రమ మద్యం కార్యకలాపాలను ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి అయినా అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తాం. ముఖ్యమంత్రి దృఢసంకల్పమైన దశలవారీ మద్య నిషేధానికి ఎవ్వరూ తూట్లు పొడవాలని చూసినా సహించేది లేదు. రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండరాదని కోరుతున్నామని కూడా వారు చెప్పుకొచ్చారు.
లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 22 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ లో ని 13 జిల్లాలలో 2178 అక్రమ మద్యం కేసులు నమోదు కాగా 22 13 మందిని అరెస్టు చేశామంన్నారు. 16,405 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. 3,61,500 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.

మన రాష్ట్రానికి సంబంధించిన 1976 లీటర్ల మధ్యనని, 1500 లీటర్ల బీర్ బాటిల్స్ ల ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న 1420 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 3000 లీటర్ల కల్లును పట్టుకున్నారు. అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న 464 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు అత్యధికంగా వినియోగించడం వలన ప్రస్తుతం విత్ డ్రాయల్ లక్షణాలు ఎక్కువగా వచ్చి వందలాదిమంది ఆస్పత్రుల పాలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీకల్లు లేనందున ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా వ్యసనపరులకు విత్ డ్రాయల్ లక్షణాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీ-అడిక్షన్ కేంద్రాలను సంప్రదించాలని, గుంటూరులోని న్యూ లైఫ్ డి- అడిక్షన్ కేంద్రం వారు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారనీ, 9849347500 నెంబరును సంప్రదించాలని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వాళ్ళంరెడ్డి లక్ష్మణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.