English | Telugu

నిర్బంధంలోకి ముఖ్య‌మంత్రి విజయ్ రూపానీ

గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. అయితే, ఆయ‌న‌కు కరోనా నిర్దారణ కావడానికి ఆరు గంటల ముందే ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గాంధీనగర్‌లోని సెక్రటేరియల్‌లో స‌మావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమై.. అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా కలిసి మాట్లాడారు. అదే రోజు సాయంత్రం ఇమ్రాన్ ఖేడెవాలాకు పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ సెల్ఫ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రుద్దీన్, ఆయన భార్యకు కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిగిన సమావేశంలో సామాజిక దూరం పాటించారని ప్రభుత్వం చెబుతున్నా.. అహ్మదాబాద్ మిర్రర్ వెల్లడించిన ఫోటోల్లో మాత్రం వీరంతా మాస్క్‌లు తీసేసి, పక్కపక్కనే కూర్చున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయని అధికారులు తెలిపారు. ఆరోగ్యం సాధారణంగా ఉందన్నారు. అయితే, సీఎం మాత్రం స్వీయ నిర్బంధంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆయనను కలుసుకోడానికి వారం రోజుల వరకూ ఎవర్నీ అనుమతించ‌రు. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్‌లు కూడా ఇళ్లకే పరిమితమ్యారు.

దరియాపూర్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ కూడా ఇమ్రాన్ కారులో ప్రయాణించారు. జమల్‌పూర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.