English | Telugu

ఈఎస్ఐలో భారీ స్కామ్... హైదరాబాద్, వరంగల్‌లో ఏసీబీ దాడులు

ఈఎస్ఐ మందుల స్కామ్ లో తవ్వేకొద్దీ డొంక కదులుతోంది. పెద్దఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌లో ఏకకాలంలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు బయటికొచ్చాయి. మొత్తం 13మంది అధికారులు, 10మంది అనధికారుల ప్రమేయం ఉన్నట్లు తేల్చిన ఏసీబీ... ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. దాంతో దేవికారాణి ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లల్లో కూడా దాడులు నిర్వహించారు. అలాగే, ముషీరాబాద్ లోని ఈఎస్‌ఐ కార్యాలయం, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్, అధికారులు, నర్సులు, వాళ్ల వాళ్ల బంధువు ఇళ్లల్లో ఏకధాటికి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు డ్యాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ లో ఓ ఛానల్ రిపోర్టర్ కు కూడా సంబంధమున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి పెద్దమొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏసీబీ... ఈ ఆస్తులకు దేవికారాణి కొడుకు కూడా బినామీగా ఉన్నట్లు తేల్చారు. ఈ కుంభకోణం తేజ ఫార్మా కంపెనీ కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

2013 నుంచి ఈ మందుల స్కామ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మందుల కొనుగోళ్లలో పెద్దఎత్తున మోసాలకు పాల్పడ్డారని, కేవలం డ్రగ్స్ అండ్ డ్రెస్సింగ్ విభాగంలోనే పది కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని ఏసీబీ చెబుతోంది.