English | Telugu
ఏపీలో దారుణ ఘటన.. పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి శిరోముండనం!
Updated : Jul 21, 2020
సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడు వరప్రసాద్ ని కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై ఇలా దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో ముని కూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు తిరిగి తనపైనే వైసీపీ నాయకుడి అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు వాపోయాడు. దీంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, అనంతరం సీతానగరం పోలీస్ స్టేషన్కు తరలించి తీవ్రంగా కొట్టి శిరోముండనం చేశారని ఆరోపించాడు.
కాగా, గాయపడ్డ బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. జరిగిన ఘటనపై కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. వెదుళ్లపల్లిలో బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.