English | Telugu

కోటి రూపాయ‌లు ఇస్తే.. ఈ ఘటనను మరిచిపోవాలా? సి.ఎం.‌పై మండిపడ్డ స్థానికుడు

నగరంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ జరిగిన ఘటనలో ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి తీరుపై విశాఖకు చెందిన శ్రీనివాస్ పాత్రుడు అనే యువకుడు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన ఆరోజు మధ్యాహ్నం 2 గంటలపాటు ఫ్యాక్టరీ వద్ద ఉండి సమీక్షించామని చెప్పారు. ఆ రెండు గంటల సమయంలో స్టైరిన్ గ్యాస్ పీల్చుకోకుండా N-95 మాస్క్ కూడా ఆపలేపోయిందన్నారు. ఒక్క 2 గంటలకే అలాగుంటే.. అక్కడ 24 విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా సిబ్బందికి కనీసం మాస్క్‌లు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ముఖ్యమంత్రి స్థాయిలో విశాఖ వచ్చిన జగన్ ముందు ప్రజల వద్దకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్లారని పాత్రుడు విమర్శించారు. ఆప్పత్రిలో బాధితులను పరామర్శించిన జగన్.. ఆయా గ్రామాలను పరిశీలించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ స్టైరిన్ ఇళ్లల్లో చిక్కుకుని అలాగే ఉందని, ఒక్కసారి చూడాలని విజ్ఞప్తి చేశారు.

మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తే.. అందరూ ఈ ఘటనను మరిచిపోతారనే ఉద్దేశంతో ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? అని అన్నారు.

ముఖ్యమంత్రి మధ్యాహ్నం వచ్చి.. సాయంత్రం వెళ్లిపోయారు, బాధితులు, గ్రామాలు కోలుకునేవరకు విశాఖలో ఉండలేకపోయారని.. ఇది ఎంతవరకు న్యాయమని శ్రీనివాస్ పాత్రుడు ప్రశ్నించారు.