English | Telugu

జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమల్ని గుర్తించండి! సి.ఎం.

విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని అన్నదానిపై గుర్తించండి. అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించండి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిపెట్టండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయండి. జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా జనావాసాలకు దూరంగా తరలింపుపై తగిన ఆలోచనలు చేయండి. అలాగే ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోండి. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సీఎం జ‌గ‌న్ సమీక్షించారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ కే మీనా పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్న సీఎస్ ముఖ్య‌మంత్రికి వివ‌ర‌ణ ఇచ్చారు. ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు కలెక్టర్ వివ‌రించారు. ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్‌ అయ్యింది. మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుంది. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయ‌ని అధికారులు సి.ఎం.కు వివ‌రించారు.

ఈ దుర్ఘ‌టనపై సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలి. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటిని నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధంచేయాలన్న సీఎం సూచించారు.