English | Telugu
మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై హత్యాయత్నం ఆరోపణలు!!
Updated : Jun 5, 2020
కాగా, ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై తాజాగా అఖిల ప్రియ స్పందించారు. తనను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ వెనకున్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ వైసీపీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అధిష్ఠానం ప్రమేయం ఉండకపోవచ్చని చెప్పారు.
తన భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని గత అక్టోబర్ లో ఓ క్రషర్ ఇండస్ట్రీ యజమాని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారని అఖిలప్రియ గుర్తుచేశారు. దీనికి సంబంధించి బెయిల్ కోసం తాము దరఖాస్తు చేశామని, ఈ సమయంలో సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తుండటం గమనించాల్సిన విషయమని అన్నారు. పక్కదారి పట్టించేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో తన హస్తం ఉన్నట్టు బయటకు రాలేదని, ఏ4 ముద్దాయిగా తనకు నోటీసులు కూడా అందలేదని తెలిపారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, విచారణ కొనసాగుతున్న తరుణంలో అఖిల ప్రియను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం సుబ్బారెడ్డికి తగదని చెప్పారు.
ఒకవేళ తన తండ్రి భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరు మీద ఉంటే కనుక, అవి ఆయనకే చెందుతాయని అఖిలప్రియ అన్నారు. అసలు తమ మధ్య ఆస్తి తగాదాలు లేవని సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పారని గుర్తుచేశారు. సుబ్బారెడ్డికి పదవులు ఇచ్చినా తాను అడ్డు చెప్పలేదని, ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తారో చూడాలని ఉందని అఖిలప్రియ చెప్పుకొచ్చారు.