English | Telugu

కరోనా పాజిటివ్ వచ్చినా ఇంటికి పంపించారు.. నన్ను కాపాడండి!

ఒకవైపు కరోనా చాలా ప్రమాదకరమైనది, ఇంటి నుండి ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వాలు చెబుతుంటే.. మరోవైపు కరోనా పాజిటివ్ తేలిన ఓ వ్యక్తికి పూర్తి చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా ఇంటికి పంపించిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఉంటున్న ఏపీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అక్కడి డాక్టర్లు.. బాధితుడికి కేవలం రెండు రోజులు చికిత్స అందించి మూడో రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన వ్యక్తి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో పని చేస్తున్నాడు. అతను కరోనా లక్షణాలతో మే 5న స్థానిక ఆసుపత్రిలో చేరగా.. 8న పాజిటివ్ అని తేలింది. అయితే రెండ్రోజుల చికిత్స అనంతరం 10న అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ఆ బాధితుడు.. తనకు పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇంటికి పంపారని.. ప్రభుత్వం తనని కాపాడాలని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తీవ్ర అనారోగ్యంతో ఒంటరిగా బాధపడుతున్నానని, తాను బయట తిరిగితే తన ద్వారా మిగతావారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని.. కావున తనకు చికిత్స అందించాలని, ఏపీ అధికారులు తనను రక్షించాలని వీడియోలో విజ్ఞప్తి చేశాడు.