English | Telugu

ఏపీ క్వారంటైన్‌లో కేర్ అద్భుతం...బ్రిటన్ పౌరుడి లేఖ!

బ్రిట‌న్ పౌరుడు కల్లీ క్లైవ్ బ్రయాంట్ రాసిన లేఖ ఇది. శ్రీ పద్మావతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం చాలా బావుంది. ఇక్క‌డ వున్న వారంద‌రినీ చాలా బాగా చూసుకున్నారు. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండే వారికి అందించాల్సిన వైద్య సేవల్ని క్ర‌మం త‌ప్ప‌కుండా అందించారు. చక్కగా గాలి వెలుతురు వచ్చేలా విశాలమైన శుభ్రమైన బెడ్రూమ్స్ ఉన్నాయి. గది కిటికీలో నుంచి బయటకు చూస్తే ఆహ్లాదాన్ని కలిగించే తిరుపతి ప్రకృతి కనువిందు చేస్తుంది.

అంతే కాదు అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతిరోజూ ప్రతి రూమ్‌కి అందించారు. స్టాఫ్ కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు. టీ, స్నాక్స్, మంచినీళ్లు, వాట్సాప్‌లో అడిగిన వెంటనే ఏమైనా అవసరం ఉంటే అందించారు. అదే స్థాయిలో పరిశుభ్రత కూడా ఉంది.

ప్రతి రోజూ డ్యూటీలో ఉన్న డాక్టర్ క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి చెక్ చేశారు. బయట నుంచి కౌన్సెలర్ కూడా వచ్చి ఎలాంటి ఆందోళన చెందవద్దని అందరిలో ధైర్యం నింపేవారు. ఇక్కడున్న ప్రొఫెషనల్ స్టాఫ్ ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకున్నారంటూ బ్రిట‌న్ పౌరుడు కల్లీ క్లైవ్ బ్రయాంట్ స్వ‌ద‌స్తూరితో ఏపి అధికారుల‌కు లేఖ రాశాడు.
క్వారంటైన్ ముగియ‌డంతో అత‌నికి భారత్ నుంచి యూకే వెళ్లడానికి అనుమతి ల‌భించింది.

కల్లీ క్లైవ్ బ్రయాంట్ 2019 అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చాడు. ఆ త‌రువాత తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. అయితే, కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటన వ‌చ్చింది. దీంతో విదేశీయుడు కావడంతో కల్లీ క్లైవ్ బ్రయాంట్‌ను మార్చి 24 న క్వారంటైన్‌కు తరలించారు. ఆయనకు రెండు సార్లు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.

మార్చి 16వ తేదీన కల్లీ క్లైవ్ బ్రయాంట్ త‌న‌ క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. కలెక్టర్ అనుమతితో అత‌న్ని క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జ్ చేశారు. వెళ్లేటప్పుడు అధికారులను అభినందిస్తూ లేఖ రాశాడు. మళ్లీ తాను తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని సందర్శిస్తానని చెప్పాడు. అలాగే, తనను బాగా చూసుకున్న అధికారులను ఎప్పుడూ మ‌ర్చిపోన‌ని, అప్పుడు తప్పకుండా పోను చేయ‌డ‌మే కాకుండా భ‌విష్య‌త్‌లో కలుస్తానని తెలిపాడు.

ఏప్రిల్ 17వ తేదీన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో అహ్మదాబాద్ వెళ్తాడు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ద్వారా బ్రిటన్ వెళ్తారు.