English | Telugu

మక్కా మసీదు మూసివేత

*కఠిన నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
* రంజాన్ మాసంలో అల్ హరం, అల్ నబవీ మసీదులు కూడా మూసివేత

రంజాన్ మాసం లో మక్కా మసీదు తో సహా, మరే ఇతర ప్రధాన మసీదుల్లోనూ ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ముస్లింలంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సలహా ఇచ్చింది. రంజాన్ మాసంలో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది. మసీదులను తెరచివుంచితే, కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మసీదులను మూసి వేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

తరావీ నమాజ్ లను, రంజాన్ ఈద్ నమాజ్ ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా సౌదీ అరేబియాలో కరోనా బారిన పడగా, వారిలో 100 మందికి పైగా మరణించారు.