English | Telugu
హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం!
Updated : Apr 12, 2020
శ్రీ విశ్వేశ్వరయ్య గారి తండ్రి గొప్ప సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. సంపాదనకోసం ఎక్కువగా ఇతర గ్రామాలను సంచరించేవారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయటం విశ్వేశ్వరయ్యగారి తల్లి మీద పడింది. ఆమె గొప్ప భక్తిపరాయణురాలు. విశ్వేశ్వరయ్యగారు తల్లి సంరక్షణలో విద్యాబుద్ధులు పొందటమే కాకుండా-ఋజువర్తన, క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకున్నారు.
అయన ప్రాధమిక విద్య చిక్ బళ్ళాపూరులోనే జరిగింది. ఉపాధ్యాయులు అతని ప్రతిభను గుర్తించి, అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. వీరికి గణిత శాస్త్రమంటే ఎక్కువ మక్కువ. ఈ విషయాన్ని గ్రహించి శ్రీ నాదముని నాయుడు గారు అనే ఉపాధ్యాయుడు ఇతనికి గణిత శాస్త్రంలో బాగా తర్ఫీదునిచ్చి, ప్రవీణుడిని చేసారు. మేనమామగారైన శ్రీ రామయ్య గారి ఆర్ధిక సహాయంతో బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో బి. ఎ లో చేరారు. సరిగ్గా ఈ సమయంలో శ్రీ విశ్వేశ్వరయ్య గారికి పితృవియోగం కలిగింది. అప్పుడు విశ్వేశ్వరయ్య గారి వయసు 15 సంవత్సరాలే! ఈ విషాద ఘట్టం ఆయనను మానసికంగా బాగా కృంగతీసింది. తన్ను తానే ఓదార్చుకొని, గుండె నిబ్బరపరచుకొని, పిల్లలకు ట్యూషన్లు చెప్పి కష్టపడి బి. ఎ ను పూర్తిచేసారు. అదృష్ట వశాత్తు మైసూరు మహారాజావారి దృష్టిలో పడ్డారు. రాజావారి ఆర్ధిక సహాయంతో పూనాలో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసారు. ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత, మొదటిసారిగా బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు.
ఆ సమయంలో వీరు బొంబాయిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. 1908 లో నిజాం నవాబు ఆహ్వానం మేరకు, నిజాం ప్రభుత్వంలో ఇంజనీరుగా చేరి పలు రిజర్వాయులను నిర్మించటమే కాకుండా, హైదరాబాద్ ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ లో అత్యంత భారీ వరదలు రావడంతో మూసీ నది ఉప్పొంగింది. ఆ వరదల్లో 50,000 మంది చనిపోయారు. అప్పుడు హైదరాబాద్ ను పాలిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విశ్వేశ్వరయ్య సేవలను వాడుకోవాలనుకున్నారు. విశ్వేశ్వరయ్య సలహా మేరకు హిమాయత్ సాగర్, గండి పేట్ జలాశయాలను నిర్మించారు. విశ్వేశ్వరయ్య ప్రతిభ నేడు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా వరద ముప్పును దూరం చేసింది. నిజాం నవాబు వీరి మేధస్సును గుర్తించి 1912 లో దివాన్ గా పదోన్నతిని కల్పించారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఏ పనిని ఆయనకు ఎవరు అప్పగించినా, ఆయన ఆ పనిని ఒక తపస్సుగా చేపట్టేవారు.
నిజం నవాబు తనకు అప్పగించిన పని పూర్తి అయిన తరువాత, నాటి మైసూరు రాష్ట్రంలో ఉద్యోగిగా చేరారు. అన్నివిధాలా ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. వారి పనితీరుని, నిజాయితీని మెచ్చి, మైసూరు మహారాజావారు బహుమానాలతో, బిరుదులతో సత్కరింపతలచిన వేళ, విశ్వేశ్వరయ్య గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు. జీతం తప్ప మరే ఇతర ప్రతిఫలాన్ని ఆయన తన జీవితంలో ఆశించలేదు. నేటి కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజ సాగర్ డ్యాం, బృందావన్ గార్డెన్స్, మైసూరు విశ్వ విద్యాలయం మొదలగునవి ఆయన కృషి వలెనే సాధ్యపడ్డాయి. ఆయన ప్రఖ్యాత ఆర్ధికవేత్త కూడా! ఆయన మైసూరు బ్యాంకు అనే సంస్థను కూడా స్థాపించి, మధ్యతరగతి ప్రజలకు పొదుపు చేసుకోవలసిన అవసరం గురించి తెలియచేసారు.
ఆయన ప్రతిభను గుర్తించి, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్ తో సత్కరించాయి. 1917 లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో అయన ప్రముఖ పాత్ర వహించారు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. ఆయన ప్రజలకు చేసినసేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు.
1955 లో భారత ప్రభుత్వం ఆయనను 'భారతరత్న' బిరుదుతో సత్కరించింది. ప్రాంతీయ బేధాలను పట్టించుకోకుండా భారత దేశానికి అనితర సేవలందించిన ఈ మహనీయుడు, తన శతజయంతి ఉత్సవాలను పూర్తిచేసుకొని, 12-04-1962 న స్వర్గస్తులయ్యారు. ఎవరైనా అఖండ మేధావిని గురించి చెప్పేటప్పుడు, 'ఆయన బ్రెయిన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్'అని చెప్పటం ఒక సామెతగా మారింది. ఆయన పుట్టిన రోజును 'ఇంజనీర్స్ డే !' గా జరుపుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుంది.