English | Telugu
చేతికొచ్చిన పంట నేల పాలైంది! బోరున విలపించిన రైతులు!
Updated : Apr 10, 2020
వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.! అండగా ఉంటామని, అధైర్య పడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా కల్పించారు.
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలం గౌరాయపల్లి, కిష్టంపేట, కొండపాక మండలం దర్గా గ్రామాలలో శుక్రవారం ఉదయం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఉద్యాన వన, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు.
సిద్ధిపేట జిల్లాలో అకాల వర్షాలు కురిసి వందల ఎకరాల్లో వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. నీటికి ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్ర ఆవేదనను మంత్రి హరీశ్ రావుతో వెలిబుచ్చారు. ఈ మేరకు ప్రధానంగా జిల్లాలోని కొమురవెళ్లి మండలం గౌరాయపల్లి, కిష్టంపేట, కొండపాక మండలం దర్గా గ్రామాలలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన వడగళ్ల వర్షానికి వందల ఎకరాల్లో వరి పంటలు నష్టం వాటిల్లిన పంటలను హరీశ్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు, వడగండ్ల వాన పడటంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు. కొమురవెళ్లి మండలంలో 6143 ఎకరాల్లో వరి పంటకు, 920 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారని, మండలంలో 226 మంది రైతులు పంట బీమా చేయగా, 113 మంది రైతులు బీమా చేయలేదని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా కొండపాక మండలంలో 6878 ఎకరాల్లో వరి పంట వేశారని, 136 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, మండలంలో 132 మంది పంట బీమా చేసుకోలేదని మంత్రి వెల్లడించారు.
నష్టపోయిన పంటలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందచేయాలని వ్యవసాయం, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నివేదిక రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు.