English | Telugu
హైదరాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన
Updated : Aug 10, 2025
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది.. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి సీఎం తెలుసుకున్నారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు.
ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రోడ్లుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి బాలుడు వివరించాడు. బుద్ధ నగర్లో జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ జశ్వంత్ నుంచి వివరాలు తెలుసుకున్నరు. తను 7వ తరగతి చదువుతున్నట్లు సీఎంకు జశ్వంత్ వివరించారు. వరద నీరు ఇంట్లోకి చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పిని ముఖ్యమంత్రికి బాలుడు తెలిపాడు. భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని బాలుడికి సీఎం రేవంత్ ధైర్యం చెప్పారు.
మరోవైపు వర్షాలు, సీజనల్ వ్యాధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులు పాల్గోన్నారు.