English | Telugu
లీటర్ గోమూత్రం ధర 500 రూపాయలట!
Updated : Mar 18, 2020
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతోంది. అయితే మూత్రం ఎక్కువగా రావాలంటే ఏం ఇంజెక్షన్ ఇవ్వాలంటూ గోశాలల నిర్వాహ కులు మెడికల్ షాపుల చుట్టూ తిరుగుతున్నారట! ఎందుకంటరా ఇప్పుడు మహారాష్ట్రలో లీటర్ గోమూత్రం 500 రూపాయల ధర పలుకుతుందట!
గోమూత్రంతో కరోనాను నయం చేయవచ్చనే ప్రచారం జరుగుతుండటంతో ఇప్పుడు గోమూత్ర పార్టీలు చేసుకోవడం ఫ్యాషన్గా మారింది. ఆవు మూత్రం కోసం వచ్చే వారి సంఖ్య పెరగడంతో డిమాండ్కు తగ్గట్టు రేట్లు పెంచేస్తున్నారు గోశాల నిర్వాహకులు. పాలసామర్థ్యం పెంచడానికి ఇంజెక్షన్లు వున్నట్లు మూత్ర సామర్థం పెంచడానికి ఏమైనా ఇంజెక్షన్లు వున్నాయా అంటూ మెడికల్ షాపుల చుట్టూ తిరుగుతున్నారట.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను తట్టుకోవాలంటే గోమూత్రం తాగాలట. ఇది ఎవరో డాక్టర్ చెప్పింది కాదు. అస్సాంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ చెబుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు కూడా ఆవు మూత్రం, ఆవు పేడ సహాయపడతాయని ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ అభిప్రాయపడ్డారు. గోమూత్రం, ఆవు పేడతో కరోనాను కూడా తరిమేయవచ్చని నేను నమ్ముతున్నాను" అని బంగ్లాదేశ్కు పశువుల అక్రమ రవాణాపై చర్చ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఆవును భారతదేశంలో పవిత్ర జంతువుగా పరిగణిస్తారని, అంతేకాకుండా చికిత్సా ప్రయోజనాల కోసం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందని ఆమె అన్నారు. ఆవు పేడను సాంప్రదాయకంగా హిందూ మతపరమైన ఆచారాలు, మందులు, ఎరువు మరియు ఇంధనంతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
కరోనాను నివారించే శక్తి కేవలం గోమూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి దేశ నలుమూలల నుంచి దాదాపు 200మందికి పైగా అతిథులుగా హాజరు అయ్యారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని అన్నారు.
గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపుతారా? అంటూ సీనియర్ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడుతోంది. గోమూత్రం, పేడతో కరోనా వైరస్ను నయం చేయవచ్చు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆమె స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ‘మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు. అంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు.
తన ట్వీట్లో ప్రొఫెసర్ స్టేవ్ హంకే ట్వీట్ను కూడా జతచేశారు. అందులో ఆయన గోమూత్రంతో, పేడతో కరోనా వైరస్ వ్యాపించదు అని దానిని సేవిస్తే మరిన్ని అనారోగ్యాలను కొనితెచ్చుకున్నవారు అవుతారని.. భారతీయులకు సైన్స్ పాఠాలు అవసరం అని ఆయన ట్వీట్ చేశారు.