English | Telugu
13 మంది న్యాయమూర్తులు.. 66 రోజులు...
Updated : Apr 24, 2020
ప్రజాస్వామ్యంలోని మూడు మూల స్తంభాలు - పార్లమెంటు, పరిపాలనా రంగం మరియు న్యాయవ్యవస్థ - ఘర్షణ పడకుండా, ఒకరి విధుల్లోకి మరొకరు రాకుండా గీతలు గీసిన తీర్పు. అలాగే రాజకీయం రాజ్యాంగాన్ని ఎంతమేరకు ఉపయోగించుకోవాలో, రాజ్యాంగ సవరణలను న్యాయవ్యవస్థ ఎంతమేరకు అనుమతించాలో కూడా చెప్పిన రోజు. శ్రీమతి ఇందిరా గాంధీ అత్యధికంగా 29 సవరణలు చేశారు. పార్టీలో పెద్ద నేతలు కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటి మహామహులను ఎదుర్కొని లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత దేశ ప్రధానిగా 1966లో బాధ్యతలు చేపట్టిన శ్రీమతి గాంధీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి, కాంగ్రెస్ కురువృద్ధులను ఎదురొడ్డి నిలవడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. వాటిలో కొన్ని ఈ రాజ్యాంగ సవరణలు.
రాజకీయం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పడిన ఘర్షణ, శ్రీమతి గాంధీ నాయకత్వం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి వంటి అంశాలు విశేషంగా చర్చ జరిగిన అత్యంత ప్రముఖమైన కేసు ఇది. ఈ కేసు తర్వాత రాజ్యాంగం మారుతూనే వస్తోంది. న్యాయమూర్తులు మారుతూనే ఉన్నారు. కానీ రాజ్యాంగ మౌళిక సూత్రాలు మాత్రం అభేద్యంగా నిలిచి ఉన్నాయి. అదే భారత ప్రజాస్వామ్య గొప్పతనం. ఏ వ్యవస్థలో అయినా కొన్ని చెదపురుగులు రావచ్చు, కానీ అవేవీ రాజ్యాంగ మౌళిక సూత్రాలను మార్చలేవు. అలాగే మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని మార్పులు అవసరం కావచ్చు కానీ రాజ్యాంగ మౌళిక స్వరూపం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.