TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
చింతా దీక్షితులు
తెలుగు కథాసాహిత్యంలో తొలితరం కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో ప్రయాణించడానికి అనువైన బాటను నిర్మించిన వారిలో మఖ్యుడు. భాషలో, నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు దీక్షితులు. ముఖ్యంగా బాలసాహిత్యాన్ని తెలుగులో సృష్టించిన వారిలో ఆద్యుడు. చింతా దీక్షితులు లేనిదే తెలుగు కథాప్రస్థానం పూర్తికానట్లే అనిచెప్పాలి.
చింతాదీక్షితులు 1891 నంబరు 1న తూర్పుగోదావరి జిల్లాలోని దంగేడు గ్రామంలో జన్మించారు. వీరిది సాంప్రదాయమైన కుటుంబం. రాజమహేంద్రవరం (రాజమండ్రి) లో బి.ఎ. చదివారు. తర్వాత సైదాపేటలో ఎల్.టి చేశారు. ఉపాధ్యయునిగా, పాఠశాలల తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. కథలతో పాటు నాటకాలు, గేయాలు రచించారు. అపూర్వమైన బాలసాహిత్యాన్ని సేకరించారు. సొంతగా సృష్టించారు.
సుమారు 100కు పైగా వీరు కథలు రచించారు. 1964లోనే 'చింతాదీక్షితులు' కథలు పేర 22 కథలు, 1996లో 'చింతాదీక్షితులు సాహిత్యం' పేరుతో మరో తొమ్మది కథలతో పాటు వారి రచనా వ్యాసంగం మొత్తం ప్రచురింపబడింది. అందుకే గురజాడ, శ్రీపాద తర్వాత తెలుగు కథాసాహిత్యానికి బీజాలు వేసిన వ్యక్తి దీక్షితులు. తొలిరోజుల్లో భీమశంకరరావుతో కలిసి కవిత్వం చెప్పారు. జంటకవులుగా వీరిద్దరూ బాగా ప్రసిద్ధి పొందారు. 1912లో వీరు 'చిత్రరేఖ' అనే అపరాధ పరిశోధన (డిటెక్టివ్) నవల రాశారు. 'హరిణదంపతులు', 'కవికన్య' గేయాలను 1923లో ప్రచురించారు. ఇక బాలసాహిత్యం విషయానికి వస్తే చింతా దీక్షితులు- స్వయంగా ప్రచారంలో ఉన్న జానపద గేయాలను సేకరించారు. స్వయంగా కొన్ని రచించారు. ఆ రోజుల్లో 'ఆంధ్ర సచిత్రవారపత్రిక'లో కొన్నిటిని ప్రకటించారు. 1931 నుంచి 'బాలానందం' పేరిట 'భారతి' మాస పత్రికలో బాలగేయాలు రాశారు. వీటిలోని 'సూరి, సీతి, వెంకి' పాత్రలు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా అలరించాయి. 'బంగారు పిలక' గేయ కథలకు అప్పట్లో ఆంధ్ర ప్రభుత్వం బహుమతి లభించింది. అదేవిధంగా 1949లో వీరి 'లక్కపిడతలు' కు భారత ప్రభుత్వం బాలసాహిత్యంలో ప్రథమ బహుమతి ప్రకటించింది.