Facebook Twitter
చింతా దీక్షితులు

చింతా దీక్షితులు


                              
                - డా.ఎ. రవీంద్రబాబు
         

తెలుగు కథాసాహిత్యంలో తొలితరం కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. తెలుగు కథ నడకలు నేర్చుకుని సరైన మార్గంలో ప్రయాణించడానికి అనువైన బాటను నిర్మించిన వారిలో మఖ్యుడు. భాషలో, నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కథకుడు దీక్షితులు. ముఖ్యంగా బాలసాహిత్యాన్ని తెలుగులో సృష్టించిన వారిలో ఆద్యుడు. చింతా దీక్షితులు లేనిదే తెలుగు కథాప్రస్థానం  పూర్తికానట్లే అనిచెప్పాలి.
           చింతాదీక్షితులు 1891 నంబరు 1న తూర్పుగోదావరి జిల్లాలోని దంగేడు గ్రామంలో జన్మించారు. వీరిది సాంప్రదాయమైన కుటుంబం. రాజమహేంద్రవరం (రాజమండ్రి) లో బి.ఎ. చదివారు. తర్వాత సైదాపేటలో ఎల్.టి చేశారు. ఉపాధ్యయునిగా, పాఠశాలల తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. కథలతో పాటు నాటకాలు, గేయాలు రచించారు. అపూర్వమైన బాలసాహిత్యాన్ని సేకరించారు. సొంతగా సృష్టించారు.
          సుమారు 100కు పైగా వీరు కథలు రచించారు. 1964లోనే 'చింతాదీక్షితులు' కథలు పేర 22 కథలు, 1996లో 'చింతాదీక్షితులు సాహిత్యం' పేరుతో మరో తొమ్మది కథలతో పాటు వారి రచనా వ్యాసంగం మొత్తం ప్రచురింపబడింది. అందుకే గురజాడ, శ్రీపాద తర్వాత తెలుగు కథాసాహిత్యానికి బీజాలు వేసిన వ్యక్తి దీక్షితులు. తొలిరోజుల్లో భీమశంకరరావుతో కలిసి కవిత్వం చెప్పారు. జంటకవులుగా వీరిద్దరూ బాగా ప్రసిద్ధి పొందారు. 1912లో వీరు 'చిత్రరేఖ' అనే అపరాధ పరిశోధన (డిటెక్టివ్) నవల రాశారు. 'హరిణదంపతులు', 'కవికన్య' గేయాలను 1923లో ప్రచురించారు.          ఇక బాలసాహిత్యం విషయానికి వస్తే చింతా దీక్షితులు- స్వయంగా ప్రచారంలో ఉన్న జానపద గేయాలను సేకరించారు. స్వయంగా కొన్ని రచించారు. ఆ రోజుల్లో 'ఆంధ్ర సచిత్రవారపత్రిక'లో కొన్నిటిని ప్రకటించారు. 1931 నుంచి 'బాలానందం' పేరిట 'భారతి' మాస పత్రికలో బాలగేయాలు రాశారు. వీటిలోని 'సూరి, సీతి, వెంకి' పాత్రలు పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా అలరించాయి. 'బంగారు పిలక' గేయ కథలకు అప్పట్లో ఆంధ్ర ప్రభుత్వం బహుమతి లభించింది. అదేవిధంగా 1949లో వీరి 'లక్కపిడతలు' కు భారత ప్రభుత్వం బాలసాహిత్యంలో ప్రథమ బహుమతి ప్రకటించింది.

           చింతా దీక్షితులు 'శర్మిష్ఠ', 'వరూధిని', 'దసరాదిబ్బ', 'శ్రీకృష్ణుడు' వంటి పౌరాణిక, చారిత్రక నాటకాలు కూడా రాశారు. వ్యవహారిక భాషలో 'అనుమానం మనిషి' అనే గొప్పనాటకాన్ని రచించారు. ఈ నాటకం ఆ రోజుల్లో భాగా ప్రాచుర్యం పొందింది.
          చింతా దీక్షితులు రాసిన కథలు వస్తువైవిధ్యంతో నిండి ఉన్నాయి. వీరు ఉద్యోగరీత్యా పలు ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి ప్రజల జీవన విధానాలను పరిశీలించడం ఇందుకు కారణం కావచ్చు. వీరి కథల్లో 'దాసరిపాట', 'గొదావరి నవ్వింది', 'మూడు కుక్కలు', 'కిష్కిందలో కోతి', 'డబ్బు డబ్బు డబ్బు', 'పెద్దమేడ' ముఖ్యమైనవి. వీరిక మాత్రం 'తోటివనంలో' కథంటే చాలా మక్కువ. దీక్షితులు 'వటీరావు ఎం.ఎ.' పాత్రను సృష్టించి సంప్రదాయాలను కీర్తిస్తూ, ఆధునిక నాగరికతను నిరసిస్తూ చాలా కథలు రాశారు. 'దాసరిపాట' కథ వయోజన విద్యా ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. 'ఆంధ్రా దోమల సభ', 'పాకశాస్త్రం పరీక్ష', 'నీతిపాఠ' లాంటివి వీరి కథల్లోని హాస్యాన్ని మనకు పట్టిస్తాయి.
          సంచార జాతుల మీద అంటే ఆదిమ జాతుల మీద మొట్టమొదటి తెలుగు కథ రాసిన ఘనత మాత్రం చింతా దీక్షితులు గారిదే... లంబాడీల జీవితాల్ని వివరిస్తుంది 'సుగాలీ కుటుంబం' కథ. 'చెంచురాణి' కథ కూడా ఈ కోవకు చెందిందే...  'అభిప్రాయభేదం' కథ ఆర్థికంగా సమాజంలో ఉన్నవారికి లేనివారికి మధ్య ఉన్న ఆంతర్యాలను ఎత్తి చూపుతుంది.   
          వీరి కథలు ప్రకృతిలోని ప్రతి అందాన్ని పట్టి చూపిస్తాయి. మనసుల్ని ఆర్ద్రతతో నింపుతాయి. సమాజంలోని వివిధ జాతుల జీవన విధానాల్ని పరిచయం చేస్తాయి. గ్రామీణుల బాధల్ని, నిరాడంబరతని చూపిస్తాయి. వీరికి పలు భాషలు వచ్చినా ఆ సాహిత్యాల ప్రభావం వీరి కథలపై కనపడదు. కథను నడిపించడంలో, వాక్యాలు కూర్చడంలో, సొగసుగా చెప్పడంలో చింతాదీక్షితులు సిద్ధహస్తులు. సంఘటనాత్మక కథలే కాదు, వర్ణనలు, సంభాషణాత్మకమైన కథలు కూడా వీరు రాశారు. వీరి కథలు ప్రకృతితో పాటు, ప్రణయం, హాస్యం, తాత్త్విక దృష్టి, పిల్లలను అలరించేవిగా మనకు కనపడతాయి. వీరు పూర్తిగా వ్యవహారిక భాషలో కథలు రాసినా అక్కడక్కడా గ్రాంథిక వాసనలు వస్తాయి. ( ముళ్లు - కంటకాలు, ఆశ్చర్యం - విస్మయం).
         చలానికి తెలుగు కథమీద ఆసక్తిని, అనురక్తిని కలిగించింది దీక్షితులుగారే అంటారు. చివరకు ఆయన మనసును, జీవితాన్ని రమణాశ్రమానికి మల్లించడంలో కూడా వీరి పాత్ర ఉంది. తెలుగు కథకు, బాలసాహిత్యానికి విశేష సేవలిందించిన చింతాదీక్షితులు 1960లో కీర్తి శేషులయ్యారు. ఏది ఏమైనా తెలుగు కథకు తొలినాళ్లలో మార్గదర్శకులుగా వ్యవహరించిన వారిలో ధీక్షితుల గారు ఒకరు అన్నది మాత్రం నిజం.