దర్భశయనంకు 'ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం'

‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ 2022 సంవత్సరానికి ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యకు లభించింది. ఈ ఏడాది ఆయనను పురస్కార కమిటీ ఎంపికచేసింది. త్వరలోనే పురస్కార ప్రదాన కార్యక్రమ వివరాలు తెలియజేయడం జరుగుతుంది.
‘శ్రీ శ్రీనివాసాచార్య గారు తమ కవిత్వానికీ, అందులోని గాఢమైన, హృద్యమైన పద వైచిత్రికీ, ఆలోచనకి, కావ్యానురక్తికి మంచి పేరు, గుర్తింపు ఇప్పటికే తెచ్చుకున్న కవులు. ఆ ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో ఈ పురస్కారం ఒక చిన్న బహుమానం మాత్రమే!’ అని కమిటీ సభ్యులు ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, మోహనకృష్ణ ఇంద్రగంటి తెలియజేశారు.
తెలుగు సాహిత్యంలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మకు ప్రత్యేక స్థానం ఉంది. 'ఏకాంత కోకిల కావ్యం', 'తూర్పున వాలిన సూర్యుడు' నవల ఆయనకు కవిగా, రచయితగా మంచి పేరు తెచ్చాయి. 'అనుభూతి గీతాలు' సంకలనంతో అనుభూతి కవిగా పాపులర్ అయ్యారు. కొన్ని సినిమాలకు ఆయన పాటలు కూడా రాశారు. చివరగా తన కుమారుడు మోహనకృష్ణ సినిమా 'సమ్మోహనం'లో ఓ పాటను ఆయన రాశారు. 2019 జూలైలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం ఆ తర్వాత ఏటి నుంచీ 'ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం'ను ఆయన కుటుంబం ఇస్తూ వస్తోంది.



