మహానాడుపై వైసీపీ విషం.. మాస్కులు ధరించి నాటకం!

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. తెలుగుదేశం చరిత్రలోనే తొలి సారిగా కడపలో మహానాడు జరుగుతోంది. ఈ ఏడాది మహానాడు నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. జగన్ అడ్డాలో ఈ నెల 27 నుంచి 29   నిర్వ‌హించే మ‌హానాడుకు ఇక రెండు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది.  వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి.  అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.  

మహానాడు నిర్వహణకు అనుమతి రద్దు చేయండి అంటూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వంలో ప‌లువురు నాయ‌కులు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చేందుకు వారంతా మాస్కుల ధరించి వచ్చారు.  
ఇంతకీ మహానాడును ఆపేయాలంటూ వారు వినతి పత్రం ఎందుకు ఇచ్చారంటే.. కరోనా మహమ్మారి. కరొనా విజృంభిస్తున్న ఈ సమయంలో మహానాడు నిర్వహణ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనీ, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుందనీ వారా వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాలనూ అనుమించవద్దనీ, వాహనాలకు ఇప్పటికే లైసెన్సులు ఇచ్చి ఉంటే వాటినీ రద్దు చేయాలనీ వారా వినతిపత్రంలో కోరారు. 

ఇదంతా ప్రజల ఆరోగ్యం పట్ల తమకున్న అక్కర, ఆందోళనగా వారు చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికే కడప .జిల్లాలో ఉనికి మాత్రంగా మిగిలిన వైసీపీ పలుకుబడి మహానాడు తర్వాత ఆ మాత్రంగా కూడా ఉండదన్న ఆందోళనే కారణమని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి కరోనా కేసులు అక్కడక్కడా ఒకటీ అరా వెలుగు చేసినప్పటికీ.. కేంద్రం ఇప్పటికే ఇప్పుడు కరోనా ప్రమాదకరమైన వైరస్ కాదని స్పష్టంగా ప్రకటించింది. ఎలాంటి అలర్ట్ ప్రకటించలేదు. ఆందోళన అవసరం లేదని ప్రజలకు భరోసా కూడా ఇచ్చింది.  

అయినా   వైసీపీ నాయ‌కులు  మ‌హానాడు నిర్వహణపై కరోనా బూచిని చూపుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.  కడపలో మహానాడు నిర్వహణతో తెలుగుదేశం పుంజుకుంటుందనీ, తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నభయంతోనే ఇప్పుడీ యాగీ చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.