బాబు మరో యూటర్న్.. దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం!!

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బాబు ఎన్ని యూ టర్నులు తీసుకున్నా పట్టించుకునే వారుండరు అంటూ ఎద్దేవా చేసారు. "ఎన్నికల షాక్‌ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూ-టర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా...మోదీ, అమిత్‌షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూ టర్నులు తీసుకున్నా పట్టించుకునే వారుండరు." అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు.

"వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులను కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అంటగట్టడం టీడీపీ దివాళాకోరుతనానికి నిదర్శనం. హింస, ఉన్మాద రాజకీయాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. మా కార్యకర్తలను 400 మందిని పొట్టన పెట్టుకుంది. జగన్ గారు దీనిపై అప్పట్లోనే గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు." అని మరో ట్వీట్ లో విమర్శించారు.

"ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు." అని కోడెల కుటుంబాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసారు.