వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాకుండా ఎవరూ అడ్డుకోలేరు: ఎంపీ విజయసాయిరెడ్డి
posted on Aug 28, 2020 6:31PM
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాకుండా ఏ శక్తీ ఆపలేదని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు అన్నారు. ఒక పక్క హైకోర్టు, సుప్రీం కోర్టులలో మూడు రాజధానుల వ్యవహారం పై కేసులు నడుస్తుండగా.. మరోపక్క హైకోర్టు స్టేటస్ కో కొనసాగుతుండగా వైసిపి ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతేకాకుండా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారని అయన చెప్పారు. టీడీపీ నేత పంకచర్ల రమేశ్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రమేశ్ బాబును పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. ఇక వైసిపికి తలనొప్పిగా తయారైన ఎంపీ రఘురామకృష్ణరాజు సభ్యత్వాన్ని లోక్ సభ స్పీకర్ రద్దు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ నుంచి కూడా తొలగించాలని కూడా అయన విజ్ఞప్తి చేశారు.