పరిటాల కుటుంబానికి వైసీపీ ఎమ్మెల్యే హెచ్చరిక!

 

ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు పరిటాల కుటుంబానికి అప్పగించడంపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవడు పడితే వాడు వచ్చి రాజకీయాలు చేసేందుకు ఇదేమైనా రాప్తాడా అంటూ నిలదీశారు. ధర్మవరం నియోజకవర్గానికి డబ్బు కోసం వస్తున్నారా లేక ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వస్తున్నారా అని ప్రశించారు. గత ఐదేళ్లలో ధర్మవరం నియోజకవర్గానికి ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు.. ఒక్కరు కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేయడం లేదని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వరదాపురం సూరి ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఆయన వెళ్లిపోయారు మళ్లీ ఇప్పుడు పరిటాల కుటుంబం వస్తుందంట అంటూ వ్యంగ్యంగా స్పందించారు. 

పరిటాల కుటుంబీకులు వచ్చి ధర్మవరం నియోజకవర్గంలో శాంతి స్థాపన చేస్తారట అంటూ ఎద్దేవా చేసారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగే హత్యలకు ఫ్యాక్షన్ లకు కారణం ఎవరో అందరికీ తెలుసు అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు కాళ్ల దగ్గర అణిగిమణిగి ఉండేవారే నియోజకవర్గంలో అడుగుపెట్టాలని అంతేకానీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేద్దాం, ప్రజల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటే సహించేది లేదని కేతిరెడ్డి హెచ్చరించారు. ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలు ఎవరు తీసుకున్నా గతంలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు క్షమాపణలు చెప్పి నియోజకవర్గంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని నియోజకవర్గంలో అడుగుపెట్టాలని చూస్తే ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని కేతిరెడ్డి హెచ్చరించారు.