వైసీపీ డర్టీ పిక్చర్!
posted on Aug 27, 2024 8:38AM
వైసీపీపేరు దేశ రాజకీయాల్లో మారుమోగుతోంది. దేశంలో ఏ రాజకీయ పార్టీలోనూ ఇలాంటి తరహా నేతలు ఉండరని వైసీపీ నేతల గురించి చర్చించుకుంటున్నారు. పలు జాతీయ ఛానెల్స్ సైతం వైసీపీ నేతలపై ఫోకస్ పెట్టాయి. ఏంటీ.. వైసీపీ నేతలు అంత గొప్ప పనులు ఏం చేశారనుకుంటున్నారా.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా వారి వ్యవహారశైలి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కష్టపడుతున్నారు. తెలుగుదేశం, జనసేన నేతలు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. ప్రజల చేత మన్ననలు పొందాలని తాపత్రయ పడుతున్నారు.
కానీ, వైసీపీ నేతలు మాత్రం అధికారంలో ఉన్న సమయంలోనూ.. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ అక్రమ సంబంధాలు, రాసలీలతో ఏపీ పరువును దేశవ్యాప్తంగా మంటగలుపుతున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ వీడియోలు, ఆడియోలు వైసీపీ అధికారంలో ఉండగా వైరల్ అయ్యాయి. అయితే, వాటిని మార్ఫింగ్ చేశారంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో వారు చెప్పిందే వేదంగా నడిచిపోయింది. కానీ, ప్రజలు మాత్రం వైసీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలని గ్రహించారు. ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చారు. అయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. ఇటీవల కాలంలో వైసీపీ నేతల ఒక్కొక్కరి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వస్తోంది.
ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిలో వ్యవహరించిన వైసీపీ నేతల బండారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో కొందరు వైసీపీ నేతలు భూకబ్జాలు, ఇసుక, మట్టి దందాలకు పాల్పడి పెద్ద మొత్తంలో అక్రమ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. మరి కొందరు భూకబ్జాలకు పాల్పడ్డారు.. ఇంకొందరు మహిళలను భయపెట్టి రాసలీలల వ్యవహారాలను నడిపించారు. ఇటీవల కాలంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాసలీలల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లోబర్చుకొని, ఆమెతో రాసలీలలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఆమె ద్వారా పెద్దమొత్తంలో దేవాదాయ శాఖ భూములను ఆక్రమించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. విజయసాయిరెడ్డి వ్యవహారం సమసిపోకముందే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తన భార్యా బిడ్డలను వదిలేసి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీకి చెందిన మహిళా నేతతో ఉంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు దువ్వాడ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యకర వీడియో వెలుగులోకి వచ్చింది. వరుసగా వెలుగులోకి వస్తున్న వైసీపీ నేతల రాసలీలల వ్యవహారం, అసభ్యకర వీడియోపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతున్న వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీకి చెందిన కీలక నేత ముంబయికి చెందిన హీరోయిన్ ను బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చజరుగుతుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. గతంలో దళిత వర్గానికి చెందిన డ్రైవర్ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు జైలుకెళ్లాడు. కొద్దిరోజులకే జైలు నంచి బయటకొచ్చాడు. అయినా జగన్ మోహన్ రెడ్డి అనంతబాబును పార్టీ బాధ్యతల నుంచి తొలగించలేదు. దీంతో జగన్ అండదండలతో అనంతబాబు మరింత రెచ్చిపోయాడు. తాజాగా ఆయన సంబంధించిన అసభ్యకర వీడియో వెలుగులోకి రావడంతో వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అనంతబాబు తనపై వచ్చిన వీడియో మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఈ వ్యవహారం బయటకు తీస్తే.. అనంతబాబుకు అసలు షాక్ తగిలే అవకాశం ఉంది. డ్రైవర్ హత్య కేసులో పోలీసులు సరైన సమయంలో చార్జిషీట్ వేయకపోవడం వల్లనే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. లేకపోతే ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం అనంతబాబు వ్యవహారాలన్నింటినీ బయటకు తెచ్చేందుకు ఆయన చేసిన ఫిర్యాదునే ఆధారంగా చేసుకుని పోలీసులతో దర్యాప్తు చేయించే అవకాశం ఉంది. మన్యంలో అరాచకశక్తిగా మారిన అనంతబాబు తనకుతానే గడ్డు పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పవచ్చు. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం స్పందించలేదు.
వైసీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించటానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికూడా ఓ కారణమన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులనుంచి వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు భూకబ్జాలు, అవినీతి అక్రమాలతో పార్టీ ప్రతిష్టను కొందరు నేతలు దెబ్బతీశారు. అయినా జగన్ మోహన్ రెడ్డి వారిని వెనుకేసుకొచ్చారు. ప్రస్తుతం ఒక్కొక్క వైసీపీ నేత రాసలీలల వ్యవహారం బయటకు వస్తున్నా వారిపై వేటు వేయకుండా జగన్ తాత్సారం చేస్తుండటంతో పార్టీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తుంది. గ్రామ, మండల స్థాయిలో ఎన్నోకష్టాలు ఎదుర్కొని పార్టీ కోసం పని చేస్తుంటే రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న కొందరు నేతలు పార్టీ పరువును తీసున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఇప్పటికైనా మేల్కొని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబులపై వేటువేయాలని, తద్వారా పార్టీపై ప్రజల్లో ఏర్పడుతున్న చెడు అభిప్రాయాన్ని తొలగించేందుకు జగన్ చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఇప్పటికైనా మేల్కోకపోతే తాము పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండని కొందరు నేతలు స్పష్టంగా చెప్పేస్తున్నారు.