వైసీపీ వైనాట్ 175ధీమా వెనుక భారీ కుట్ర ఓట్ల గల్లంతే!

వైసీపీ వైనాట్ 175 నినాదం గురించి తెలిసిందే. మూడు నాలుగు నెలల క్రితం వరకూ ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు ఈ నినాదాన్ని ఊదరగొట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ వైనాట్ 175 అంటూ క్యాడర్ చెవులలో మార్మ్రోగించారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని చూశారు. కానీ, ఆ తర్వాత మెల్లగా వైసీపీ చేయించుకున్న సొంత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలలో ప్రజలలో వ్యతిరేకత చూసిన వైసీపీ నేతలు కాస్త సౌండ్ తగ్గించారు. అయితే, అసలు వైనాట్ 175 అనేంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలను వెంటాడాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం సహా కీలక నేతలు, ఉద్దండులు గల స్థానాలతో సహా మావే అంటూ వైసీపీ ప్రకటించడం ఒక రకంగా దుస్సాహసమే. అయితే, ఇదేదో తమ పనితనాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారనో.. తమ పాలన అంత సుభిక్షంగా సాగడం వలనో.. తమ ప్రభుత్వం ప్రజలను అంత గొప్పగా ఉద్ధరించడం వలనో వచ్చిన కాన్ఫిడెన్స్ కాదన్నది ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నిజం.

 వైసీపీ అందిపుచ్చుకున్న వైనాట్ 175 నినాదం వెనుక అతి పెద్ద కుట్ర ఉందని ఆది నుండి రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు కుట్రని ఇప్పుడు బయట పడుతున్నది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే గెలుపు తమదే అన్నది వైసీపీ ధీమా. జగన్ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ ప్లాన్ పకడ్బందీగా అమలు జరుగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తగా.. ఇద్దరు అధికారులపై వేటు కూడా పడింది. ఎన్నికల విధులకు సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం కూడా విధించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో భారీగా ఈ ఓట్ల తొలగింపు చేపట్టారు. దీంతో అక్కడి తెలుగుదేశం నేతలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టి బండారం బయటపెట్టారు.

నిజానికి ఈ కుట్రను కూడా వైసీపీ అండ్ కో ఒక ప్లాన్ ప్రకారం నడిపించింది. సజ్జల నేతృత్వంలో ఏర్పాటైన ఓ టీమ్.. వాలంటీర్ల ద్వారా ఓటర్ల సమాచారం సేకరించి ఎన్నికల వ్యూహాలను రచించే ఐ ప్యాక్ టీంకి అందించడం.. ఎక్కడెక్కడ ఓట్లు తీసేయాలో ఐప్యాక్ టీం ప్రణాళిక రెడీ చేసి వైసీపీకి అందించడం.. ఎక్కడిక్కడ వైసీపీ నేతలు ఫామ్ 7లతో దరఖాస్తులు ఇవ్వడం.. వాటిని అధికారులు ధృవీకరించి తొలగించడం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం బయటపడడంతో కలకలం రేగింది. రంగంలోకి దిగిన ఈసీ దర్యాప్తు చేసి అధికారులపై వేటు వేసింది. బదిలీలను నిలిపివేసింది. అయినా ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడాపెడా బదిలీలు సాగుతున్నాయి. మరోవైపు సమయం చూసి ఇప్పుడు మరోసారి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని ఆచరణలోకి పెట్టినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్టుతో ఇటు నేతలు, అటు క్యాడర్ అంతా ఆ వైపే దృష్టి ఉంది. అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు, క్యాడర్ యాక్టివ్ గా ఉండేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి వైసీపీ ఫామ్ 7లతో ఈ ఓట్ల తొలగింపునకు సిద్దమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లు గల్లంతు అయినట్లు తెలుస్తున్నది. ఈ కొత్త ఓటర్ లిస్ట్ ఈనెల 27న రాబోతుంది. అందులో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు లేపేశారో బయటపడుతుంది. మరోవైపు మరోసారి ఓట్ల తొలగింపుకు సన్నాహాలు సిద్ధం చేసున్నారట. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందించబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఈసీ కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితమవుతున్నది తప్ప చర్యలు మాత్రం అమలవడం లేదు. మొత్తంగా చూస్తే ఇలాంటి కుట్రలతోనే వైసీపీ వైనాట్ 175 అంటూ రెచ్చిపోతున్నదని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.