"దొంగ దొంగ" పట్టుకోండి..లండన్‌లో మాల్యా వెంటపడ్డ భారతీయులు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా‌ పరాయి దేశంలోనూ దర్జాగా గడిపి తాను ఎక్కడ ఉన్నా విలాస పురుషుడినేని చెప్పకనే చెప్పారు. అయితే తాము ఎంతో కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును స్వప్రయోజనాలకు వాడుకుని..రుణాన్ని తిరిగి చెల్లించని మాల్యాపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లతో విరుచుకుపడుతున్న జనం మాల్యా కనపడితే ఊరుకుంటారా..? లండన్‌లో అదే జరిగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకించేందుకు మాల్యా కెన్నింగ్టన్ ఓవర్ గ్రౌండ్‌కు వచ్చారు. నీలం రంగు సూటులో మాల్యాను చూసిన టీమిండియా అభిమానులు ఒక్కసారిగా దొంగ, దొంగ అంటూ కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టారు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన మాల్యా వేగంగా అక్కడి నుంచి స్టేడియం లోపలికి వెళ్లిపోయారు.