మోడీ షా జోడీ మ్యాజిక్ బాక్స్లో..ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో?
posted on Jul 23, 2025 9:16PM
.webp)
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (జూలై 21),నాటకీయ పరిణామాల నడుమ తమ పదవికి రాజీనామా చేశారు. ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదించారు. జగదీప్ ధన్ఖడ్’ ఎందుకు రాజీనామా చేశారు? ఏమిటి, అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.
ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేసినా, అందుకు కారాణాలు ఏవైనా, భారత ఉపరాష్ట్రపతి సీటు ఖాళీ అయింది. ఎన్నిక అనివార్యమైంది. మరోవంక భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సన్నాహాక చర్యలు పూర్తయ్యాక, ఎన్నికల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
అదలా ఉంటే, చక చకా పరిణామాలు నేపధ్యంగా, అనూహ్యంగా తరుముకొస్తున్న ఉపరాష్టపతి ఎన్నిక పట్ల, సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానకి అభ్యర్ధుల ఎంపిక మొదలు గెలుపు ఓటముల లెక్కల వరకు. ‘ఉప’ ఎన్నిక పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ అప్పుడే మొదలైంది. అధికార ఎన్డీఎ, విపక్ష ఇండియా కూటమి తరపున బరిలో దిగే అభ్యర్ధులు ఎవరన్న విషయంలో,ముఖ్యంగా అధికార కూటమి అభ్యర్ధి ఎవరన్న విషయంగా అనేక వ్యూహగానాలు వినిపిస్తునాయి.
అనేక పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్,హరివంశ నారాయణ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మొదలు కేంద్ర మాజే మంత్రి రవిశంకర్ ప్రసాద్ వరకు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ మొదలు మెగా స్టార్’చిరంజీవి, బీజేపే రాజ్యసభ సభ్యడు కే. లక్ష్మణ్’ వరకు అనేక తెలుగు పేర్లు సహా చాలా పేర్లు వినిపిస్తునాయి.
అయితే,అంతిమంగా మోదీ షా జోడీ’ మ్యాజిక్ బాక్స్ నుంచి ఎవరి పేరు పై కొస్తుందో చెప్పలేము. అలాగే ఇండియా కూటమి నుంచి ఎవరు బరిలో దిగినా పోటీ నామమాత్రంగానే ఉంటుందని,అంటున్నారు. చివరకు,ఏ కూటమిలో లేని, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేడీ, బీఎస్పీ వంటి తటస్థ పార్టీలు ఇండియా కూటమికి వైపు మొగ్గు చూపినా ఎన్డీఎ అభ్యర్ధి విజయం తధ్యమని అంటున్నారు. అయితే, బీజేపీ..ఒంటరిగా గెలిచే అవకాశం మాత్రం ఏ కొంచెం కూడా లేదు.
తెలుగుదేశం, జేడీయు సహా ఇతర ఎన్డీఎ పార్టీల మద్దతుతో మాత్రమే అధికార కూటమి అభ్యర్ధి విజయం సాధ్యంవుతుందని ఓట్ల గణాంకాలు చెపుతున్నాయి ప్రస్తుత లెక్కల ప్రకారం,ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో (నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. అందులో అందులో 5 రాజ్యసభ, ఒక లోక్ సభ, సిటు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427 ఓట్లు,(293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87, మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి.
అలాగే, ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య సుమారు 30 వరకు ఉంటుంది. సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైతే, ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్దతిలో జరుగుతుంది.విప్ వర్తించదు. కాబట్టి,ఎంపీలు, ఆత్మ సాక్షిగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చును.అలాగే, పార్టీలకు కూటమి కట్టుబాట్లు వర్తించవు.గత 2022 ఎన్నికల్లో, ఎన్డీఎ అభ్యర్ధి జగదీప్ ధన్ఖడ్’కు పోటీగా ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మార్గరెట్ అల్వాను బరిలో దించాయి.
అయితే,ఆమె అభ్యర్ధిత్వంపై అభ్యంతరం చెప్పిన తృణమూల్ కాంగ్రెస్’ ఓటింగులో పాల్గొన లేదు. ఫలితంగా ధన్ఖడ్’ మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్ల భారీమెజారిటీతో గెలిచారు. మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఈసారి కూడా, అభ్యర్ధి ఎంపిక తర్వాత లెక్కలు మారినా మారవచ్చును. అయితే, ఎన్డీఎలో కంటే ఇండియా కూటమిలోనే, కోతలకు ఎక్కువ అవకాశం ఉంది, కాబట్టి, ఎన్డీఎ గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు.