ఉద్యోగులకు గుడ్న్యూస్.. జూన్ నుంచే పీఆర్సీ అమలు..
posted on Jun 9, 2021 8:20AM
ఎప్పుడో ప్రకటించిన పీఆర్సీకి ఇప్పటికి మోక్షం లభించింది. ఇప్పట్లో ఇస్తారో ఇవ్వరో అని టెన్షన్ పెట్టించిన ఉద్యోగుల జీతాల పెంపునకు తెలంగాణ కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 30 శాతం పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు కూడా ఈ పీఆర్సీ పెంపు వర్తిస్తుంది.
జూన్ నెల నుంచే పెంపును వర్తింపజేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే జులై నుంచి పెరిగిన జీతం అందుతుంది. నోషనల్ బెనిఫిట్ను 1 జులై 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు. వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు. పింఛన్ దారులకు 1 ఏప్రిల్ 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించనుంది.
పీఆర్సీ అమలుతో 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ది కలగనుంది. మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజా కేబినెట్ భేటీలో జూన్ నుంచే పీఆర్సీ వర్తింపజేయాలని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.