బ్రహ్మానందం!

ఏ మానవుడికైనా ఆనందంగా జీవించడమే.  అలా భావించడం లక్ష్యం. అయితే అందుకోసం మానవుడు బాహ్యప్రపంచంలో వస్తువులలో దేహేంద్రియాలలో వెతుకుతున్నాడు. తాత్కాలిక సుఖాలు, సంపదలతోనే అనందం ఉందన్న భ్రాంతిలో బతికేస్తున్నాడు. అవే శాశ్వతం అనుకుంటున్నాడు.  అసలు సమస్య మానవుడిలోనే ఉంది.  శాశ్వతమైన  ఆనందం అనేది ఎక్కడో లేదు. ఆనందం సహజంగా లభించాలంటే  నిత్యము, శాశ్వతము, చైతన్యవంతము, సత్యము, సహజమైన ప్రతి జీవిలోనూ ఉంది.  దాని గుర్తించి అందుకు అనుగుణంగా జీవించడమే నిజమైన ఆనందం.  ఉన్నది ఒక్కటే, అదే స్వరూప ఆనందం! అదే సచ్చిదానందం!  అదే బ్రహ్మానందం! అదే శాశ్వతమైన ఆనందం.

మనస్సు అంతర్ముఖం అయినప్పుడే దాన్ని గ్రహించగలం, అందుకోగలం. మనిషి శుద్దత్వంతో జన్మిస్తాడు. సహజ సిద్దంగానే చైతన్య స్వరూపుడు. అజ్ఞానంతో (మాయ ప్రభావం వల్ల) తన స్వస్వరూపాన్ని గ్రహించలేక జీవిస్తున్నాడు! కానీ  పుట్టుకతోనే చిత్తశుద్ధి ఉంటే ప్రతి జీవుడు ముక్తుడే.  పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం కలవాడు.  జీవుడు పరిమిత జ్ఞానం కలవాడు.  అంటే జడమైన భాగం శరీర రూపంలో ఉంది. పరమాత్మలోని చైతన్యం  జీవాత్మగా ఉంది. ఈ రెండింటి యొక్క మిశ్రమ స్వరూపమే జీవుడు!   పరిమిత జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానంగా మార్చుకోవాలి!

బహిర్ముఖంగా ఉన్న మనస్సుతో శాశ్వతమైన ఆనందం కోసం అంతర్ముఖంగా అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అవుతుంతో, అప్పుడు మానవుడు తనకు  తెలీనీ  ఎన్నో రహస్యాలను గ్రహించగలడు. సూక్ష్మంలోనే  మోక్షం ఉంది  ఒక్కసారిగా  మనస్సుని  అంతర్ముఖం  చేయాలంటే  చాలా కష్టం.  దానికి కఠోర  సాధన  చేయాలి.  చైతన్యవంతమైన జ్ఞానంతో బుద్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెచ్చుకోవచ్చు!   

  మనస్సును జయించడం జ్ఞానంతోనే సాధ్యము! చంచలమైన మనస్సుని అధీనంలోకి తెచ్చుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం.  జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో నిరంతర  అభ్యాసం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు!

మనస్సును ఇంద్రియాలతో జోడించకపోతే, చిత్తవృత్తి నిరోధం కలిగి ఆలోచనలు క్రమేపీ తగ్గి ఆలోచనా రహిత స్థితికి చేరతాడు.  అదే తన స్వస్థితి, ఆత్మస్వరూపము!  అదే బ్రహ్మానందం.