ప్రధాని సాక్షిగా మంత్రి అసభ్య ప్రవర్తన

 

ప్రజా ప్రతినిధులు..అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వారు. కానీ వాళ్లే తప్పుల మీద తప్పులు చేస్తూ కెమెరా కంటికి చిక్కి వారి విలువను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ మంత్రి తన సహచర మంత్రితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి ఘటనలపై పోరాటం చేయాల్సిన భాద్యత గల పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఇంతటి నీచానికి ఒడిగట్టటం చర్చనీయాంశం. అది కూడా ప్రధాని మోడీ ఎదుటే జరగటం గమనార్హం. ప్రధాని మోడీ గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రి సంతన చక్మా ని అసభ్యంగా తాకాడు. ఆమె నడుముపై చేయి వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా మంత్రి కాంతిదేవ్ అనుచిత ప్రవర్తనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంతిదేవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు ర్యాలీ నిర్వహించారు. అసభ్యంగా ప్రవర్తించిన కాంతిదేవ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు అగర్తల నగరంలో నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని మహిళలు హెచ్చరించారు. కాకపోతే ఈ ఘటనపై ఇరువురు మంత్రులు ఇంతవరకు స్పందించలేదు.