చంద్రబాబు దీక్షాసమరం.. బోసిడీకే అర్థం తెలుసా?.. సమంత కేసు.. టాప్ న్యూస్ @ 7pm
posted on Oct 20, 2021 6:38PM
1. టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటలపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు. చంద్రబాబు దీక్ష సమయంలో టీడీపీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవనుంది. మరోవైపు, శనివారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
2. ప్రతిపక్షాలు బూతులు తిడుతుంటే.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారన్నారు సీఎం జగన్రెడ్డి. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను సమర్థిస్తున్నట్టు సీఎం జగన్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ‘‘ప్రజల ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు.’’ అని జగన్ అన్నారు.
3. టీడీపీ ఆఫీస్కి వచ్చిన సీఐ నాయక్పై దాడి చేశారంటూ నారా లోకేశ్పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం రచ్చ రాజేస్తోంది. ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్పై కేసులు పెట్టారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
4. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించడానికి వెళితే తనపైనే మర్డర్ కేసు పెడతారా? అంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. డీజీపీ వైసీపీ కండువా కప్పుకోవాలంటూ దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు.
5. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నేరస్థులు ఎంతవారైనా ఉపేక్షించొద్దని కేసీఆర్ ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను బలోపేతం చేయాలని చెప్పారు. విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
6. పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదని డీజీపీ సవాంగ్ అన్నారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నముఖ్యమంత్రిలాంటి వారిని తిట్టకూడదన్నారు. అభ్యంతరకమైన పదాలు పదేపదే వాడారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. మంగళవారం తనకు వాట్సప్ కాల్ వచ్చిందని, అప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఉన్నానని.. ఎవరు మాట్లాడుతున్నది స్పష్టంగా లేదన్నారు డీజీపీ.
7. ఏపీలో రచ్చ రాజేసిన ‘బోసడీకే’ పదానికి ఎంపీ రఘరామకృష్ణరాజు అర్థం వెతికి చెప్పారు. బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్లో ఉందని రఘురామ తెలిపారు. ‘‘టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనేదానికి అర్థం.’’ అని రఘురామ రాజు వివరించారు.
8. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే పాదయాత్ర చేస్తున్నాని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చెప్పారు.
సీఎం కేసీఆర్ అవినీతిని బయట పెడతానని హెచ్చరించారు. కేసీఆర్కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ను చీల్చి చెండాడుతానని ప్రకటించారు. దేశంలోనే నెంబర్ వన్ అధ్వాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని షర్మిల మండిపడ్డారు. ‘‘తెలంగాణలో నిజంగా సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా. సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
9. తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది. గురుకులాల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ బోధన చేపట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.
10. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగేలా వీడియోస్ చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్లపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు నటి సమంత. సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీతో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్పై పిటిషన్ దాఖలు చేశారు.