పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
posted on Apr 24, 2025 4:24PM

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బారికేడ్స్ అడ్డుపెట్టి జనాలను నిలువరించారు. విషయమేంటంటే..
పెహల్గాం ఉగ్రదాడిలో 27 మంది మరణించిన ఘటనపై దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగి ఉన్న సమయంలో పాక్ హైకమిషన్ కార్యాలయం కేక్ ఆర్డర్ చేసి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓ వైపు ఉగ్రదాడి మృతుల అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ఓ వ్యక్తి కేక్ తీసుకుని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి వెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడి యోలో ఓ వ్యక్తి చేతిలో కేక్ తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వడివడిగా నడుచుకువెడుతున్నాడు. అక్కడ ఉన్న మీడియా అతనిని ప్రశ్నిస్తోంది. అయితే మీడియా ప్రతినిథులకు సమాధానం ఇవ్వకుండా ఆ కేక్ ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెహల్గాం ఉగ్రవాదిలో మరణించిన వారి కోసం యావత్ దేశం కన్నీరు పెడుతుంటే, శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే.. పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదీ భారత గడ్డ మీద పాక్ హైకమిషన్ కార్యాలయం ఈ సంబరాలకు వేదిక కావడం ఆ దేశం తెంపరి తనానికి, పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ హైకమిషన్ లో సంబరాలు అంటూ వార్త వేగంగా వ్యాపించింది. భారత్ విషాద సాగరంలో మునిగి ఉన్న సమయంలో అదే గడ్డ మీద పాకిస్థాన్ సంబరాలా అంటూ జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా భారత్ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. అదలా ఉంటే.. పెహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది.
సింధు నదీ జలాల్లో ప్రతి నీటిబొట్టూ పాకిస్థాన్ కే చెందుతుందంటూ ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ఇండస్ వాటర్ ట్రయిటీ నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనడమే కాకుండా, భారత్ నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాపరంగా ఎదుర్కొంటామనీ, భారత్ కు గట్టి గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. అంతర్జాతీయ సంస్థలకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగజాలదనీ, భారత్ కు ఆ హక్కు లేదనీ పేర్కొన్నారు.
ఇలా ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్ లో చొరబడి విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు భారీ ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. పీకోకేలో ఇందు కోసం ఉగ్రవాదులు 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేశాయని గుర్తించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. దాదాపు 130 మంది టెర్రరిస్టులు భారత్ లో చొరబడేందుకు తమ బాస్ ల ఆదేశాల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నాయి.