అరుణాచలంలో మోత్కూరు యువకుడి దారుణ హత్య
posted on Jul 12, 2025 3:16PM

అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణహత్యకు గురయ్యాడు. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన చిప్పలపల్లి రవీందర్ ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా అసెంబ్లీ ప్రాంగణం లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో నివశిస్తున్నారు.ఆయన కుమారుడు విద్యాసాగర్ (28) మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ కంపెనీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. విద్యాసాగర్ గతం లో రెండు సార్లు స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లి వచ్చాడు. అయితే మూడో సారి ఒంటరిగా వెళ్లాడు.
ఈ నెల 4న మోత్కూరు వచ్చి తాతను చూసి.. ఆ తరువాత 6వ తేదీన అరుణాచలం బయలుదేరి వెళ్లాడు. అరుణాచలంలో ఆలయ గిరిప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో అక్కడకు వెళ్లిన విద్యాసాగర్ ఈనెల 8న రాత్రి వేళ గిరిప్రదర్శన చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి గొంతు కోశారు. రాత్రంతా కొన ఊపిరితో రోడ్డుపైనే పడి ఉన్న విద్యాసాగర్ ను 9వ తేదీ ఉదయం పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ మేరకు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అరుణాచలం వెల్లారు. పోస్టుమార్టం తరువాత విద్యాసాగర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.