టీడీపీ నేత ఆత్మహత్య.. లోకేశ్ కు సూసైడ్ లేఖ
posted on Mar 29, 2017 12:28PM
టీడీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి సంబంధించిన నేత ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు చనిపోతూ తాను సూసైడ్ లేఖ కూడా రాశాడు. అది కూడా నారా లోకేశ్ కి. అసలు సంగతేంటంటే... కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశాడు. టీడీపీ ప్రభుత్వ వైఖరి పట్ల విసిగిపోయిన ఆయన.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందంటూ ఆవేదన చెందుతూ.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. పార్టీ అభ్యున్నతి కోసం జీవితాంతం తాను పని చేశానని... తమకు పదవులు రాకపోయినా బాధపడలేదని... కానీ, ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పని చేసి, ఇప్పుడు పార్టీలో చేరిన వారి నుంచి పార్టీని కాపాడాలని కోరుతూ సూసైడ్ నోట్ రాశారు. సేవ్ టీడీపీ... ఇక సెలవు అంటూ లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఆత్మహత్య టీడీపీలో కలకలం రేపుతోంది.