మనీష్ సిసోడియాకు కండీషన్డ్ బెయిలు
posted on Aug 9, 2024 11:24AM
మద్యం కుంభకోణంలో అరెస్టై గత 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. మనీష్ సిసోడియా బెయిలు పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానంఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పాస్ పోర్టును అప్పగించాలనీ, దేశం విడిచి వెళ్లకూడదని షరతులు విధించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని పేర్కొంది.
బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ లు ఆరోపణలతో ఓ వ్యక్తి ప్రాథమిక హక్కులను కాలరాయలేమని, ఓ వ్యక్తిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేమని పేర్కొంటూ... ఈ విషయాన్ని కింది కోర్టులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అవినీతిలో కీలకంగా వ్యవహరించారని ఆనాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేసి,
గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చార్జిషీట్ దాఖలు చేసినందున ఈ కేసులు అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితలకు కూడా బెయిలు లభించేందుకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు.