బోటు చిక్కినట్లే చిక్కి చేజారింది... గోదావరిలో లంగరేసిన ధర్మాడి బృందం
posted on Oct 17, 2019 10:54AM

గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి నెలరోజులు దాటిపోతున్నా, ఇంకా 13మంది ఆచూకీ దొరకకపోవడంతో... బోటును ఏదోవిధంగా బయటికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గోదావరిలో లంగరేసిన ధర్మాడి బృందానికి బోటు చిక్కినట్లే చిక్కి చేజారింది. బోట్ల వెలికితీతలో నైపుణ్యమున్న ధర్మాడి సత్యం బృందం... ఇప్పటికే ఒకసారి ప్రయత్నించి విఫలమైనా... అధికారులు మరోసారి అవకాశమివ్వడంతో... బోటును బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
మూడ్రోజులుగా కచ్చులూరు దగ్గర ఆపరేషన్ చేపడుతోన్న ధర్మాడి సత్యం బృందం.... గణనీయమైన పురోగతి సాధించింది. ధర్మాడి టీమ్ వేసిన లంగరుకు బోటు చిక్కింది. అయితే, లంగరును లాగుతుండగా బోటు ముందుకు కదిలినా, అంతలోనే లంగరు పట్టు వదిలేసింది. లంగరుతో లాగడం వల్ల యాక్సిడెంట్ స్పాట్ నుంచి బోటు ముందుకు జరిగిందని ధర్మాడి సత్యం తెలిపారు. అయితే, నేరుగా లంగరు వేయగలిగితేనే బోటు బయటికి తీయగలగమని ధర్మాడి సత్యం అంటున్నారు. నదీగర్భంలోకి వెళ్లి... నేరుగా బోటుకు లంగరు వేసేందుకు విశాఖ నుంచి గత ఈతగాళ్లను రప్పిస్తున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లతో నేరుగా బోటుకు లంగరు వేయగలిగితే విజయం సాధించినట్లేనని, అది సాధ్యంకాకపోతే.... ప్రొక్లైన్ సాయంతో ఆపరేషన్ చేపడతామని ధర్మాడి సత్యం అంటున్నారు.