సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత.. వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
posted on Aug 10, 2020 9:50AM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
రెండు సార్లు మంత్రిగా పని చేసిన సాంబశివరాజు.. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి సాంబశివరాజు వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94 లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు సాంబశివరాజు. మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఈ తరం నాయకులు ఎందరికో ఆయన రాజకీయ గురువు. అయితే, రాజకీయ కురువృద్ధుడిగా, మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందినప్పటికీ.. వైసీపీలో చేరిన తరువాత సాంబశివరాజుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు కరువైందనే చెప్పాలి.