మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు.. ముందుముందు మరింత మంది?
posted on Apr 26, 2025 10:28AM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డిని శుక్రవారం(ఏప్రిల్ 25) సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షాను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.
అదలా ఉంటే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచిన అధికారులు.. చార్జిషీట్ లో మాత్రం నిందితుడిగా చేర్చారు. దీనిని బట్టి విజయసాయిని అప్రూవర్ గా మార్చేందుకు అధికారులు రంగం సద్ధం చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు వాస్తవమేననడానికి చార్జిషీట్ లో తనను నిందితుడిగా చేర్చినట్లు తెలియగానే.. విజయసాయి మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకూ తనకు తెలిసిన ప్రతి విషయం, ఈ స్కాంతో సంబంధం ఉన్న అందరి గురించీ చెబుతానంటూ ఓ ట్వీట్ చేశారు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి అప్రూవర్ గా మారిపోయారనది అవగతమౌతోందంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిని పోలీసు అధికారులు విశ్వసించే అవకాశాలు లేవనీ, తాము దర్యాప్తులో కనుగొన్న అంశాలు, విజయసాయిరెడ్డి చెబుతున్న అంశాలూ బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆయన నిజాలే చెబుతున్నారని నిర్ధారించుకున్న వరువాత మాత్రమే విజయసాయిని పోలీసులు విశ్వసించే అవకాశం ఉందంటున్నారు.
ఇలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్టైన సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన సమాచారం విజయసాయి రెడ్డి ద్వారానే పోలీసులకు అందిందంటున్నారు. లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కంపెనీల నుంచి ఉత్పత్తికి తగ్గట్లుగా ముడుపులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజ్ తో పాటు ఏ8 చాణక్యను అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. రానున్నరోజులలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు.