రూపాయికే అంత్యక్రియలు
posted on Jun 17, 2019 1:30PM
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ఒక్క రూపాయికి అంతిమయాత్ర కార్యక్రమాన్ని నగర మేయర్ రవీందర్సింగ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
కరీంనగర్లోని కట్టరాంపూర్కు చెందిన మంచాల లలిత మరణించగా ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనే స్వయంగా పాడె మోసి అందరికి ఆదర్శంగా నిలిచారు. రూపాయి చెల్లింపు రశీదు అందించి పాడె కట్టడం నుంచి డప్పు చప్పుళ్లు, అంతిమయాత్ర, దహన సంస్కారాల వరకు అన్నీ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా మేయర్ రవీందర్సింగ్ మాట్లాడుతూ దహన సంస్కారాలు నిర్వహించడమనేది దైవ కార్యమన్నారు. ఈ పథకాన్ని కుల, మత, పేద, ధనిక వర్గాలకు అతీతంగా అమలు చేస్తామన్నారు. ఈ పథకం కోసం బల్దియా నుంచి రూ.1.50 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి అంతిమ యాత్ర-ఆఖరి సఫర్ పేరిట ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.