జగన్ను 'కైకాల' ఇప్పుడే ఎందుకు పొగిడారు? లేఖ వెనుక 'మెగా' రాజకీయం?
posted on Jan 20, 2022 10:58AM
ఇటీవల సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరి.. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇది జరిగి కొన్ని వారాలు అవుతోంది. తాజాగా, తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించినందుకు కృతజ్ఞతలు అంటూ.. కైకాల సత్యనారాయణ.. సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రత్యేకంగా ఓ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. నటీనటుల సంక్షేమం కోసం మీరు చూపే చొరవ అభినందనీయమంటూ జగన్ను కొనియాడారు కైకాల. ఆ లెటర్ క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో హోరెత్తింది. అబ్బా.. మా జగనన్న ఎంత మంచోడో అంటూ కామెంట్లూ వస్తున్నాయి.
మంచి చేస్తే అభినందించాల్సిందే. కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అందులో తప్పుబట్టేదేమీ లేదు. కైకాల సత్యనారాయణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు సీఎం జగన్ ఫోన్ చేయడం.. మానసిక ధైర్యం చెప్పడం.. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేయడంపై ముఖ్యమంత్రిని అభినందించాల్సిందే. అంత వరకూ ఓకే. కానీ..... ఈ లెటర్ రాసిన సమయం, సందర్భమే కాస్త అనుమానాస్పదం అవుతోంది.
కైకాల ఆసుపత్రిలో చేరి, కోలుకొని.. నెల రోజులకు పైనే అవుతోంది. జగన్ ఆ పెద్దాయనకు ఫోన్ చేసి మాట్లాడితే.. అందుకు కృతజ్ఞతగా కోలుకున్న తర్వాత కైకాల సైతం జగన్కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పొచ్చు. అలా కాకుండా.. కొన్ని వారాలు గడిచాక.. ఇలా బహిరంగ లేఖ రాయడమే కాస్త తేడాగా ఉందంటున్నారు. కైకాల లేఖ వెనుక చిరంజీవి ప్రోద్భలం ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కైకాల సత్యనారాయణ, చిరంజీవిలది ఎనలేని అనుబంధం. చిరంజీవి అంటే కైకాలకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. సొంత బ్యానర్లో, 1985లో 'చిరంజీవి' టైటిల్తో.. 'చిరంజీవి' హీరోగా ఓ సినిమానూ నిర్మించారు కైకాల. వారిద్దరి రిలేషన్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. కట్చేస్తే....
ఇటీవల సినిమా టికెట్ ధరల తగ్గింపుతో ఇండస్ట్రీకి బద్ద శత్రువుగా మారారు సీఎం జగన్. మంత్రులు సైతం నోటికొచ్చినట్టు మాట్లాడి మరింత మంట రాజేశారు. ఆ అగ్గిని చల్లార్చడానికి.. చిరంజీవితో కథ నడిపిస్తున్నారు జగన్. రాజ్యసభ సీటు ఆఫరో.. విశాఖలో స్టూడియోనో.. డీల్ ఏంటో తెలీదుగానీ.. మెగాస్టార్ జగన్ విషయంలో చాలా చొరవ తీసుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో విందు రాజకీయంతో.. జగన్ ప్రభుత్వం త్వరలోనే గుడ్న్యూస్ చెబుతుందంటూ అయింట్మెంట్ రాశారు. ఫీల్గుడ్ మూడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ స్క్రీన్ప్లేలో భాగంగానే.. ఇప్పుడిలా.. లేటైనా, లేటెస్ట్గా.. కైకాల సత్యనారాయణతో సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతూ బహిరంగ లేఖ రాయించారని అంటున్నారు. ఫోనో, పర్సనల్ లెటరో రాసుంటే అది నిజంగా కృతజ్ఞతే అనుకునే అవకాశం ఉండేది. కానీ, ఇలా ఓపెన్ లెటర్ రాసి.. పబ్లిసిటీకి ఛాన్స్ ఇవ్వడం వల్లే.. సోషల్ మీడియాకు ఛాన్స్ ఇచ్చినట్టైంది. సంపన్నుడైన కైకాలకు.. జగన్ ఆర్థిక సాయం చేయడం దగ్గరి నుంచి.. నటీనటుల సంక్షేమం కోసం మీరు చూపే చొరవ మరోసారి ఈ విధంగా నిరూపితమైంది.. అంటూ లేఖలో జగనన్నను కైకాల కీర్తించడం వరకూ.. అంతా నాటకీయంగా సాగిపోతోందని అంటున్నారు నెటిజన్లు.