విడాకులిచ్చేయండి.. తిట్టుకుచస్తున్నాం...

 

ప్రముఖ మలయాళ, హిందీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిజి పద్దెనిమిదేళ్ళ వైవాహిక జీవితం ముగిసింది. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ విడాకుల కోసం చైన్నె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని లిజి ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. తాము విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న విషయం తమ పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు తెలిసిన విషయమేనని లిజి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ జీవితాలలో ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఇంతకు మించి తమను ఇంకా వార్తల్లోకి లాగి తమ ఏకాంతానికి భంగం కలిగించవద్దని లిజి ఆ ప్రకటనలో కోరారు. వాస్తవానికి చాలా సంవత్సరాల క్రితమే ప్రియదర్శన్ - లిజి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పుడే వీరిద్దరూ విడిపోవాలని అనుకున్నారు. అయితే కమల్ హాసన్, గౌతమి, మోహన్‌లాల్, ఆయన భార్య చొరవతో ఇంతకాలం వీరి సంసార బండి కుంటుతూ నడిచింది. అయితే ఇక తామిద్దరూ కలసి వుండలేమని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. ప్రియదర్శన్, లిజి 1996లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. వారిద్దరూ విదేశాలలో చదువుకుంటున్నారు. నటి లిజీ ‘ఆత్మబంధం’ వంటి అనేక తెలుగు సినిమాలలో కూడా నటించారు. దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘నిర్ణయం’ చిత్రానికి దర్శకత్వం వహించారు.